బాబ్రీ కూల్చివేతపై 9 నెలల్లో తీర్పు ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

బాబ్రీ కూల్చివేతపై 9 నెలల్లో తీర్పు ఇవ్వాలి

Published Sat, Jul 20 2019 6:44 AM

Supreme Court asks judge to deliver Babri verdict in nine months - Sakshi

న్యూఢిల్లీ: మీ తీర్పును 9 నెలల్లోగా వెల్లడించాలని బాబ్రీ మసీదు కూల్చివేత కేసును విచారిస్తున్న స్పెషల్‌ కోర్టును సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. స్పెషల్‌ కోర్టులోని ఆ జడ్జి పదవీ కాలాన్ని తీర్పు వెల్లడించే వరకు పొడిగించింది. సుప్రీంకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో బీజేపీ ప్రముఖులు అద్వానీ, ఎమ్‌ఎమ్‌ జోషీ, ఉమాభారతి సహా పలువురు నిందితులుగా ఉన్నారు. రాజకీయంగా సున్నితమైన ఈ కేసులో సాక్ష్యాల నమోదును కచ్చితంగా 6 నెలల్లోగా పూర్తి చేయాలని పేర్కొంది.

సెప్టెంబర్‌ 30వ తేదీతో ముగియనున్న జడ్జి పదవీకాలాన్ని పొడిగించేందుకు 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. యూపీ ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన న్యాయవాది ఐశ్వర్య భాతీ వాదిస్తూ.. జ్యుడీషియల్‌ అధికారుల పదవీకాలాన్ని పొడిగించే నిబంధనలు ఏమీలేవన్నారు. కేసు పూర్తయ్యేంత వరకు పదవీకాలాన్ని పొడిగించమని ఆదేశిస్తున్నామని, ఒకవేళ కేసు తీర్పు వెలువరించేందుకు రెండేళ్లు పట్టినా అప్పటివరకు పదవీకాలాన్ని పొడిగించాల్సిందేనని వ్యాఖ్యానించింది.  

Advertisement
Advertisement