
ప్రజలను దోచుకుంటోంది
వ్యక్తిగత కారణాల వల్ల గత 17ఏళ్లలో తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎట్టకేలకు రంగంలోకి దిగారు.
⇒ మోదీ ప్రభుత్వంపై సోనియా ధ్వజం
⇒ యూపీ ఓటర్లకు లేఖ
న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాల వల్ల గత 17ఏళ్లలో తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎట్టకేలకు రంగంలోకి దిగారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలకు ప్రజలను దూరం చేస్తూ, వారి సమస్తాన్నీ దోచుకుంటున్న శక్తులను ఓడించాలని ఉత్తరప్రదేశ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ గురువారం జరగనున్న నేపథ్యంలో తాను, తన కొడుకు రాహుల్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ, అమేథీల్లోని ఓటర్లను ఉద్దేశించి ఆమె బుధవారం ఈమేరకు లేఖ రాశారు. దీన్ని తన వ్యక్తిగత సందేశంగా భావించాలని కోరారు.
‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజల వద్ద ఉన్న సమస్తాన్నీ దోచుకుంటోంది. మోదీ తన కుర్చీ కాపాడుకోవడానికి అలా చేస్తున్నారు. పిడికెడు మంది కోసం, ఎంపిక చేసుకున్న పారిశ్రామికవేత్తల కోసం పేదల ప్రయోజనాలను పణంగా పెట్టి వీరు పనిచేస్తున్నారు. దేశం దృష్టి అంతా రాయ్బరేలీ, అమేథీలపై ఉంది. మీరంతా కాంగ్రెస్కు ఓటేసి ఈ ప్రాంత అభివృద్ధి కట్టుబడి ఉన్న నాకు సహకరించండి’ అని కోరారు. ‘మంచి రోజులు(అచ్చేదిన్) తీసుకురావడానికి బదులు మోదీ ప్రభుత్వం మీ భూములు, ఉద్యోగాలు, కష్టార్జితాన్ని లాక్కుంది. వారి దుష్పరిపాలన వల్ల రైతులు నష్టపోయారు. యువత ఉద్యోగాలు కోల్పోయింది. మహిళలు ఇబ్బందులు పడుతున్నారు’ అని పేర్కొన్నారు.