
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాల దశ నుంచి భద్రత విషయంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయడం వల్ల ‘సురక్షిత భారతదేశం’సాధ్యమవుతుందని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఏర్పాటై 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్డీఎంఏ వార్షిక థీంగా ‘పాఠశాలల భద్రత’ను ప్రకటించడం మంచి పరిణామం అని అన్నారు.
దీని ద్వారా స్కూల్ దశ నుంచి విద్యార్థులను భద్రత విషయంలో భాగస్వామ్యం చేయవచ్చన్నారు. విద్యార్థుల ఉత్సాహం, వారి సృజనాత్మకత విపత్తుల నివారణలో మెరుగ్గా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో రంగారెడ్డి జిల్లా డీఈవో కె.సత్యనారాయణ రెడ్డి, వనపర్తి డీఈవో సుశీందర్రావు పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలల భద్రత విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణకు అనుసరిం చాల్సిన ప్రణాళికలను సదస్సులో వివరించినట్లు వారు తెలిపారు.