
సాక్షి ప్రతినిధి, చెన్నై: రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై నేడు స్పష్టత రానుంది. అభిమానులతో సమావేశాల ఆఖరిరోజున తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇస్తానని ఇటీవల రజనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, శనివారం ఐదోరోజు అభిమానులతో సమావేశం సందర్భంగా రజనీ మాట్లాడుతూ.. ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కనాలని, ఒకవేళ అవి నెరవేరకుంటే కలత చెందొద్దని సూచించారు. కలలు నెరవేర్చుకునేందుకు అడ్డదారులు వెతుక్కోవద్దని స్పష్టం చేశారు. అనేక మలుపులు, దశలు దాటిన తన సినీ జీవితం ప్రస్తుతం 2.0, కాలా చిత్రాలకు చేరుకుందనీ, ఈ చిత్రాల తరువాత తన జీవితం దేవుడి చేతిలో ఉంటుందని చెప్పారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు అభిమానుల ప్రార్థనలే తనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాయన్న రజనీ.. వారికి కృతజ్ఞతలు తెలిపారు.