వాణిజ్యంలో కొత్త అధ్యాయం | PM Narendra Modi promises US stable tax regime; Obama pledges for trade | Sakshi
Sakshi News home page

వాణిజ్యంలో కొత్త అధ్యాయం

Jan 27 2015 2:00 AM | Updated on Sep 2 2017 8:18 PM

ఢిల్లీలో జరిగిన 66వ గణతంత్ర పరేడ్ దినోత్సవ పరేడ్ కార్యక్రమంలో అభివాదం చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, బరాక్ ఒబామా

ఢిల్లీలో జరిగిన 66వ గణతంత్ర పరేడ్ దినోత్సవ పరేడ్ కార్యక్రమంలో అభివాదం చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, బరాక్ ఒబామా

ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్, అమెరికా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి.

* భారత్‌లో సరళతరం కావాలి: ఒబామా
* అనువైన పరిస్థితులు కల్పిస్తాం: మోదీ
* భారత్  వృద్ధికి తోడ్పాటుపై  అమెరికా అధ్యక్షుడు ఒబామా భరోసా
* 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, రుణాలు ఇస్తామని వెల్లడి
* భారత్ వ్యాపారాల ద్వారా అమెరికాలో ఉద్యోగాల కల్పన
* మేధోహక్కులు పరిరక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ
* కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 శాతం పెరిగిన అమెరికా పెట్టుబడులు
* భారత్-అమెరికా వ్యాపారవేత్తల సదస్సులో ప్రసంగించిన ఇరు దేశాధినేతలు

 
ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్, అమెరికా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు భరోసా కల్పించారు. భారత్ వృద్ధికి తోడ్పాటు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హామీ ఇచ్చారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఇరుదేశాల వ్యాపారవర్గాల సమావేశంలో వారిద్దరూ ప్రసంగించారు. ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరిగే దిశగా భారత్‌లో నియంత్రణ విధానాలు సరళతరం కావాలని ఒబామా అభిప్రాయపడ్డారు. పన్నుల విధానాలు స్థిరంగా ఉండాలని, మేధోహక్కులపరమైన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.
 
 అమెరికాలో భారత్ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని, భారత్ వ్యాపారాలు అక్కడ అనేక ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు.  అమెరికా అధ్యక్షుడి ప్రసంగానికి స్పందనగా భారత్ ప్రధాని మాట్లాడుతూ పెట్టుబడులను స్వాగతించే, ప్రోత్సహించే పరిస్థితులను కల్పిస్తామన్నారు. ఇన్వెస్టర్లకు ఇబ్బందికరంగా మారిన రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ (గత లావాదేవీలకు తాజాగా పన్నువేయడం) తదితర అంశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని, గతంలో జరిగిన కొన్ని తప్పిదాలను సరిచేశామని మోదీ చెప్పారు. త్వరలోనే మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్త్తామన్నా రు. అలాగే భారీ ప్రాజెక్టులు ఎలాంటి అడ్డంకులు లేకుండా త్వరితగతిన పూర్తయ్యేలా తాను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement