‘ఆసియాన్’తో బంధం బలోపేతం: మోదీ
సింగపూర్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని
న్యూఢిల్లీ: ఆసియాన్, తూర్పు ఆసియా దేశాలతో సంబంధాల బలోపేతానికి తన సింగపూర్ పర్యటన దోహదపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆసియాన్–భారత్, తూర్పు ఆసియా దేశాల సదస్సుకు హాజరయ్యేందుకు మోదీ మంగళవారం సింగపూర్ బయల్దేరారు.
ఈ పర్యటనలో మోదీ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య నాయకుల సమావేశానికి(ఆర్సీఈపీఎల్ఎం) కూడా హాజరుకానున్నారు. ‘ఆసియాన్, ఇండో–పసిఫిక్ దేశాలతో సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామనడానికి నా పర్యటనే నిదర్శనం. ఆసియాన్, తూర్పు ఆసియా దేశాల నాయకులతో సమావేశం కావడానికి ఉత్సాహంతో ఎదురుచూస్తున్నా’ అని సింగపూర్కు బయల్దేరడానికి ముందు మోదీ వ్యాఖ్యానించారు. బుధవారం సింగపూర్ ఫిన్టెక్ సదస్సులో మోదీ కీలకోపన్యాసం చేయనున్నారు.