అజిత్, అజహర్ ఇళ్లకు కరెంట్ కట్ | NDMC cuts off power supply of Ajit Singh's Delhi bungalow | Sakshi
Sakshi News home page

అజిత్, అజహర్ ఇళ్లకు కరెంట్ కట్

Sep 14 2014 2:14 AM | Updated on Mar 9 2019 3:08 PM

ఢిల్లీలోని అధికారిక నివాసాలను ఖాళీ చేయకుండా మొండికేస్తున్న కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీల నివాసాలకు కేంద్రం విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసింది.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అధికారిక నివాసాలను ఖాళీ చేయకుండా మొండికేస్తున్న కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీల నివాసాలకు కేంద్రం విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసింది. 30 ఇళ్లకు  సరఫరాలు నిలిపివేయగా అందులో అజిత్‌సింగ్, జితేంద్ర సింగ్, మహమ్మద్ అజహరుద్దీన్ నివాసాలు కూడా ఉన్నాయి. అధికారిక నివాసాలను ఖాళీచేయాలని వారికి అనేకసార్లు విన్నవించినా, తగినంత సమయమిచ్చినా స్పందించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఎన్‌డీఎంసీ అధికారి ఒకరు తెలిపారు.

విద్యుత్, నీటి నిలిపివేత తర్వాత కొందరు ఖాళీచేశారని అయితే ఇంకా 15 మంది ఖాళీ చేయాల్సి ఉందని చెప్పారు. దీనికి సంబంధించి లోక్‌సభ హౌసింగ్ కమిటీకి కూడా నివేదిక సమర్పించామని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన పార్లమెంటు సభ్యులు తమ క్వార్టర్లను ఖాళీ చేయకపోవడంతో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ఇళ్లు కేటాయించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నాలుగోతేదీ లోపు ఇళ్లు ఖాళీచేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ గతంలోనే నోటీసులిచ్చింది. ఆ నోటీసులకు స్పందించని వారి నివాసాలకు ప్రస్తుతం విద్యుత్, నీటి సరఫరాలు నిలిపివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement