‘జమిలి ఎన్నికలపై మరింత చర్చ జరగాలి’
సాక్షి, న్యూఢిల్లీ : లా కమిషన్ జమిలి ఎన్నికలపై 164 పేజీల ముసాయిదా నివేదికను విడుదల చేసిన సందర్భంగా జమిలి ఎన్నికలపై మరింత చర్చ జరగాలని అభిప్రాయపడింది. ఏకకాల ఎన్నికల్లో అనేక జటిలమైన సమస్యలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలపై మరింత పరిశీలన అవసరమని పేర్కొంది. కేంద్రానికి సిఫారసు చేసే ముందు అన్ని వర్గాలు మరింత చర్చ జరపాలని కోరింది. లా కమిషన్ ఏకకాల ఎన్నికలపై చర్చకు ఏడు అంశాలను లేవనెత్తింది.
లా కమిషన్ చర్చకు ఉంచిన ఏడు అంశాలు :
- ఏకకాల ఎన్నికల వల్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థకు భంగం కలుగుతుందా?
- హంగ్ అసెంబ్లీ, పార్లమెంటు ఏర్పడిన సమయంలో పరిస్థితి ఏమిటి ?
- అటువంటి సమయంలో పదో షెడ్యూల్ను సవరించాలా ?
- ఏకకాల ఎన్నికలు ఆలోచన మంచిదే అయినా ఆచరణాత్మక విధానం ఏమిటి ?
- రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సవరించాలి ?
- ముసాయిదా నివేదికలో చర్చించిన అంశాలు కాకుండా ఇంకా మరి ఏమైనా విషయాలు పరిశీలించాల్సి ఉందా?
- ఏకకాల ఎన్నికల వల్ల రాజ్యాంగపరమైన ఉల్లంఘన జరిగే అవకాశం ఉందా ?
ఈ ఏడు అంశాలపై మరింత చర్చ అవసరమని, అన్ని వర్గాలు దీనిపై చర్చించిన తర్వాతే కేంద్రానికి తుది సిఫారసు చేస్తామని తేల్చిచెప్పింది.