
రెండు దేశాల మధ్య చర్చలతో అటు సరిహద్దు సమస్యతో పాటు కశ్మీర్లో సాగుతున్న మారణకాండకూ ఓ పరిష్కారం దొరుకుతుందని..
శ్రీనగర్ : కశ్మీర్లో శాంతిని నెలకొల్పాలంటే భారత్,పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలే శరణ్యమని నేషనల్ కాన్ఫెరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ కేంద్ర వర్కింగ్ కమిటీ (సీడబ్య్లూసీ) సమావేశంలో బుధవారం ఈ మేరకు ఏకగ్రీవం తీర్మానం చేసింది. రెండు రోజుల పాటు శ్రీనగర్లో జరిగిన పార్టీ సమావేశాల్లో చివరి రోజు ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా భారత్, పాక్ మధ్య కొనసాగుతున్న వైరుద్యాలకు చర్చల ద్వారా చరమగీతం పాడాల్సిన అవసరముందని ఫరూక్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య చర్చలతో అటు సరిహద్దు సమస్యతో పాటు కశ్మీర్లో సాగుతున్న మారణకాండకూ ఓ పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు.
‘‘సమైక్యత, సమగ్రత, ప్రత్యేకతకు కశ్మీర్ కట్టుబడి ఉంది. పాక్,భారత్ విదేశాంగ మంత్రుల మధ్య జరగాల్సిన చర్చలు విఫలం కావడంతో తాము ఎంతో నిరాశ చెందాము. పాక్తో చర్చలకు కశ్మీర్ ప్రజలకు ఎంతో కాలం నుంచి ఎదురుచుస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ మేరకు చొరవ తీసుకోవాలి’’ అని ఫరూక్ అన్నారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370, 35A లపై కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయాన్ని తెలపాలని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 35ఎ కొనసాగింపుపై తమ నిర్ణయాన్ని తెలిపేంత వరకు ఏ ఎన్నికలకు వెళ్లబోమని ఎన్సీ తేల్చిచెప్పింది. సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలకు నిరసనగా ఐరాస వేదికగా జరగాల్సిన భారత్,పాక్ విదేశాంగ మంత్రుల సమావేశంను భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.