ఆరు సంవత్సరాల కఠోరమైన పరిశోధనల అనంతరం గ్యాస్ గ్యాంగ్రీన్ ఔషధం ఇకపై మన దేశంలో కూడా తయారు చేయనున్నారు.
పింప్రి (మహారాష్ట్ర): ఆరు సంవత్సరాల కఠోరమైన పరిశోధనల అనంతరం గ్యాస్ గ్యాంగ్రీన్ ఔషధం ఇకపై మన దేశంలో కూడా తయారు చేయనున్నారు. బాంబు పేలుళ్లు, బుల్లెట్ గాయాలు, మధుమేహ వ్యాధి గ్రస్తులకు గాయాలు ఏర్పడినప్పుడు ఈ ఔషధాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఔషధాన్ని తయారు చేసిన పింప్రిలోని హఫ్కిన్ పరిశోధన సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్స్ విభాగం వారి అనుమతులను కూడా తీసుకుంది. త్వరలోనే మార్కెట్లోకి ఈ మందు విడుదల కానుంది.
బాంబు పేలుళ్లు, యుద్ధాల సమయంలో మందుగుండు వల్ల శరీరంపై గాయాలైనప్పుడు క్లస్ట్రీడియమే అనే బ్యాక్టీరియా ఈ గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి కండరాలను నాశనం చేస్తుంది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులకు గాయాలైనప్పుడు ఈ బ్యాక్టీరియా గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి కండరాలను నాశనం చేస్తుంది. ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలో ఒక విధమైన గ్యాసును తయారు చేస్తుంది. ఈ గ్యాసులో నైట్రోజన్ గ్యాస్ 75 శాతం ఉంటుంది. ఆక్సీజన్ శాతం తక్కువ కావడం ద్వారా వ్యాధిగ్రస్తులు మృతి చెందే అవకాశం ఉంది. దీంతో ఈ ఔషధం ఈ బ్యాక్టీరియాను సంహరించేందుకు దోహదపడుతోంది. అలాగే అన్ని రకాల గ్యాస్ గ్యాగ్రీన్ రోగాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని హఫ్కిన్ బయో-ఫోర్మాస్యూటికల్ కార్పోరేషన్ లిమిటెడ్ మేసేజింగ్ డెరైక్టర్ సంభాజీ జెండే తెలిపారు. పింప్రిలో ఈ మందు తయారు చేసేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బయో టెక్నాలజీ విభాగం అనుమతినిచ్చిందని తెలిపారు.
ప్రస్తుతం ఈ మందును విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నట్లు జే.జే.ఆస్పత్రి జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్కు చెందిన సీనియర్ సర్జన్ డాక్టర్ అజయ్ భండ్యార్ తెలిపారు.