3లోపు కావేరి ముసాయిదా | Frame draft scheme for Cauvery judgment implementation by May 3 | Sakshi
Sakshi News home page

3లోపు కావేరి ముసాయిదా

Apr 10 2018 2:44 AM | Updated on Sep 2 2018 5:18 PM

Frame draft scheme for Cauvery judgment implementation by May 3 - Sakshi

న్యూఢిల్లీ: కావేరి నదీ యాజమాన్య బోర్డుకు సంబంధించిన ముసాయిదాను మే 3వ తేదీలోపు తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటయ్యే వరకు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త వహించాలని కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకు సూచించింది. ఆరు వారాల్లో బోర్డును ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి 16నే సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు కేంద్రం చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తప్పుబట్టారు.

మరోవైపు కేంద్రం తీరుకు నిరసనగా చెన్నైలో ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) క్రికెట్‌ మ్యాచ్‌లను నిర్వహించకూడదన్న వాదనకు బలం పెరుగుతోంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించి చెన్నైలో తొలి మ్యాచ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య మంగళవారం జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తే చిదంబరం స్టేడియం బయట ఆందోళన చేసి అడ్డంకులు సృష్టిస్తామని తమిళగ వళ్వురిమై కచ్చి (టీవీకే) అనే సంస్థ తాజాగా హెచ్చరించింది. చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించకపోవడమే మంచిదని తమిళనాడు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి జయకుమార్‌ కూడా అన్నారు. ఇక్కడి పరిస్థితి గురించి ఐపీఎల్‌ నిర్వాహకులకు తెలియజేశామనీ, అయితే మ్యాచ్‌లు నిర్వహిస్తే నిబంధనల ప్రకారం భద్రత సహా అన్ని రకాల సదుపాయాలూ కల్పిస్తామని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement