
అవి ‘కసబ్’ పార్టీలు!
ఎన్నికల ప్రచారంలో పొట్టి పదాలతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే సంప్రదాయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా కొనసాగిస్తున్నారు.
కాంగ్రెస్, సమాజ్వాదీ, బీఎస్పీలపై అమిత్షా ధ్వజం
చౌరిచౌరా: ఎన్నికల ప్రచారంలో పొట్టి పదాలతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే సంప్రదాయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా కొనసాగిస్తున్నారు. తాజాగా బుధవారం యూపీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, సమాజ్వాదీ, బీఎస్పీలను ‘కసబ్’ పార్టీలుగా ఆయన అభివర్ణించారు. కసబ్ పార్టీలను అంతమొందిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని యూపీ ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘ఈ ఎన్నికల ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రజలు కసబ్ నుంచి విముక్తి పొందాలి. కసబ్ అంటే నా ఉద్దేశం వేరే కాదు. కా అంటే కాంగ్రెస్, స అంటే సమాజ్వాదీ, బ్ అంటే బీఎస్పీ’ అంటూ ఇక్కడ జరిగిన ఎన్నికల సభలో ప్రజలకు వివరణ ఇచ్చారు.
అజ్మల్ కసబ్ ముంబైపై జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాది అన్న విషయం తెలిసిందే. ‘సమాజ్వాదీ, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతి’లను స్కామ్గా, బీఎస్పీని ‘బహెన్జీ సంపత్తి పార్టీ’గా మోదీ.. మోదీని ‘మిస్టర్ నెగటివ్ దళిత్ మ్యాన్’గా బీఎస్పీ చీఫ్ మాయావతి.. స్కామ్ అంటే ‘సేవ్ కంట్రీ ఫ్రమ్ అమిత్ షా అండ్ మోదీ’ అని అఖిలేశ్లు ఒకరినొకరు విమర్శించుకోగా, తాజా కసబ్ వ్యాఖ్యతో యూపీ ఎన్నికల ప్రచారాన్ని షా మరింత రక్తి కట్టించారు. ఎన్నికల అనంతరం బీఎస్పీ సహా ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోబోదని షా బుధవారం మీడియాకిచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. షా చేసిన కసబ్ వ్యాఖ్య బీజేపీ మతతత్వ మనస్తత్వానికి అద్దం పడుతోందని కాంగ్రెస్ విమర్శించింది.