మీడియావారు రూ.48 లక్షలు ‘తిన్నారు’

Chennai Apollo Hospital Bill Shows Jayalalitha Stay Cost - Sakshi

జయకు చికిత్స సమయంలో భోజనాల ఖర్చుగా అపోలో వెల్లడి

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కవరేజీ విధుల్లో ఉన్న మీడియా వారికి భోజనాల ఖర్చు రూ.48 లక్షలు అయ్యిందని అపోలో ఆస్పత్రి ప్రకటించింది. 2016 సెప్టెంబర్‌ 22వ తేదీ రాత్రి నుంచి డిసెంబర్‌ 5వ తేదీ ఆమె కన్నుమూసే వరకు వివిధ భాషల జాతీయ, రాష్ట్రీయ మీడియా ప్రతినిధులు అపోలో ఆస్పత్రి ముందు రేయింబవళ్లూ వార్తలను కవర్‌ చేశారు.

జయను పరామర్శించేందుకు ఏ సమయంలో ఏ వీఐపీ వస్తారోనని టిఫిన్, భోజనాలకు కూడా వెళ్లకుండా ఆస్పత్రి ప్రధాన గేటు ముందు పడిగాపులు కాశారు. ఇలా 75 రోజుల పాటు పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు పనిచేశారు. జయ చికిత్సకు రూ.6.85 కోట్లు ఖర్చయింది. ఇందులో రూ.6 కోట్లు గతేడాది జూన్‌ 15న చెల్లించగా మిగతా మొత్తం చెల్లించాల్సి ఉంది. కాగా, అపోలో ఆస్పత్రి ముంగిట వార్తల కవరేజీలో ఉన్న మీడియా వారికి ఆస్పత్రి యాజమాన్యం ఆహార పొట్లాలను, వాటర్‌ బాటిళ్లను సరఫరా చేసినందుకు రూ.48.43 లక్షలు ఖర్చయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top