‘ఢిల్లీ కాలుష్యానికి పాక్, చైనాలే కారణం’
మీరట్ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రతకు పాకిస్తాన్, చైనాలే కారణమని యూపీ బీజేపీ నేత నిందించారు. భారత్లోకి ఈ రెండు పొరుగు దేశాలు విష వాయువులను వదిలిఉండవచ్చని బీజేపీ నేత వినీత్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. భారత్ అంటే భయపడుతున్న పాకిస్తాన్, చైనాలు ఈ చర్యకు పాల్పడిఉండవచ్చని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు పాక్ కుయుక్తులను నిరోధిస్తుండటంతో పొరుగు దేశానికి దిక్కుతోచడం లేదని దుయ్యబట్టారు.
పాకిస్తాన్ విషపూరిత వాయువులను విడుదల చేసిందా అనే కోణంలో మనం పరిశీలించాల్సిన అవసరం ఉందని వినీత్ అగర్వాల్ పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో కాలుష్య తీవ్రతకు పొరుగు రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్ధాలను తగులబెట్టడం కారణమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న వాదన అర్థరహితమని అన్నారు. దేశానికి రైతు వెన్నెముకని, రైతులను, పరిశ్రమలను నిందించడం తగదని వినీత్ అగర్వాల్ చెప్పారు.