ధోనీ.. నువ్వు ఆ బ్రాండ్‌ను వదిలేయ్‌! | Amrapali society residents in Noida troll Dhoni over pending work | Sakshi
Sakshi News home page

ధోనీ.. నువ్వు ఆ బ్రాండ్‌ను వదిలేయ్‌!

Apr 9 2016 10:14 AM | Updated on Sep 3 2017 9:33 PM

ధోనీ.. నువ్వు ఆ బ్రాండ్‌ను వదిలేయ్‌!

ధోనీ.. నువ్వు ఆ బ్రాండ్‌ను వదిలేయ్‌!

నోయిడాలోని ఓ హౌసింగ్‌ సొసైటీ వాసులు ఇప్పుడు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఆశ్రయించారు.

న్యూఢిల్లీ: నోయిడాలోని ఓ హౌసింగ్‌ సొసైటీ వాసులు ఇప్పుడు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఆశ్రయించారు. రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉండటం మానుకోవాలని ఆయనకు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తడంతో అమ్రాపాలి కంపెనీ దిగొచ్చింది. హౌసింగ్ సొసైటీలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చింది.

నోయిడా సెక్టర్‌ 45లోని 'షప్పైర్‌' ప్రాజెక్టు మొదటి దశను 2009లో అమ్రాపాలి కంపెనీ ప్రారంభించింది. ఇందులో వెయ్యి ఫ్లాట్లు ఉండగా.. నిర్మాణాలు పూర్తికావడంతో 800 కుటుంబాలు ఇందులోకి మారాయి. అయితే ఈ ప్రాజెక్టులోని చాలా టవర్లకు ఇప్పటివరకు విద్యుత్‌, సివిల్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయని సొసైటీ వాసులు చెప్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చడంలో మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ వారు ఆందోళన దిగారు. ఇందులోభాగంగా అమ్రాపాలి ధోనీని దుర్వినియోగం చేసింది (#AmrapaliMisuseDhoni) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్‌ ప్రచారాన్ని ప్రారంభించారు. ధోనీ వెంటనే ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం మానుకోవాలని, తమ సొసైటీలోని పెండింగ్ పనులను పూర్తిచేసేలా కంపెనీపై ఒత్తిడి తేవాలంటూ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో కాలనీవాసులు ఉద్యమాన్ని చేపట్టారు.

సొసైటీ వాసుల ఆందోళనతో దిగొచ్చిన అమ్రాపాలి కంపెనీ ఓ ప్రకటన చేసింది. ప్రాజెక్టులో 4 నుంచి 5శాతం పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా 90 రోజుల్లో పూర్తిచేస్తామని హామీ ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement