
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా(ఏఐ) గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. తైవాన్(రిపబ్లిక్ ఆఫ్ చైనా) పేరును తమ అధికారిక వెబ్సైట్లో చైనీస్ తైపీగా మార్పు చేసింది. తైవాన్ భౌగోళిక స్థితితో పాటు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనిపై తైవాన్ తీవ్రంగా మండిపడింది. ఎయిర్ఇండియా నిర్ణయంపై తాము తీవ్రంగా నిరాశ చెందామని ఢిల్లీలోని తైపీ ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం(టీఈసీసీ) తెలిపింది. చైనా నుంచి వస్తున్న అర్థంలేని ఒత్తిడికి తలొగ్గి భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నామని టీఈసీసీ విమర్శించింది. వెంటనే తమ దేశం పేరును వెబ్సైట్లో తైవాన్గా పునరుద్ధరించాలని ఎయిర్ ఇండియాను డిమాండ్ చేసింది. ఏదేమైనా ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొంది. కాగా, ఎయిరిండియాకు విదేశాంగ శాఖ మద్దతుగా నిలిచింది.