అలాంటివి చూసి బోర్‌ కొట్టేసింది! | Namitha Speech in Cocktail Movie Audio Launch | Sakshi
Sakshi News home page

అలాంటివి చూసి బోర్‌ కొట్టేసింది!

Feb 24 2020 11:37 AM | Updated on Feb 24 2020 11:37 AM

Namitha Speech in Cocktail Movie Audio Launch - Sakshi

సినిమా: రొమాన్స్‌ చిత్రాలు చూసి చూసి బోర్‌ కొట్టేసిందని నటి నమిత పేర్కొంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీజీ.ముత్తయ్య, ఎం.దీప కలిసి పీజీ.మీడియా వర్క్స్‌ పతాకంపై నిర్మించిన చిత్రం కాక్‌టైల్‌. నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఇందులో ఆయనకు మిత్రులుగా రమేష్, మిథున్, విజయ్‌ టీవీ కలక్కుపోవదు యారు ఫేమ్‌  బాలా, ఖురేషీ ముఖ్య పాత్రల్లో నటించారు. వీరితో పాటు షియాజీ షిండే, మనోబాలా, మైమ్‌గోపి నటించారు. నవ దర్శకుడు ఆర్‌. విజయ్‌మురుగన్‌ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆర్‌జే.రవిన్‌ ఛాయాగ్రహణం, ఎస్‌.సాయిభాస్కర్‌ సంగీతాన్ని అందించారు. కాగా ఈ చిత్రంలో ఆస్ట్రేలియాకు చెందిన కాక్‌టైల్‌ అనే పక్షి ప్రధాన పాత్రలో నటించిందని, అలా ఒక పక్షి ప్రధాన పాత్రలో నటించడం ఇదే ప్రప్రథం అని నిర్మాతలు పేర్కొన్నారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలోని ఒక కళాశాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నమిత మాట్లాడుతూ రొమాన్స్‌ చిత్రాలు చూసి చూసి బోర్‌ కొట్టేసిందని పేర్కొంది. కాక్‌టైల్‌ లాంటి కామెడీ  చిత్రాలను చూడడమే ఇష్టమని చెప్పింది. ఈ చిత్రాన్ని తాను థియేటర్‌కు వెళ్లి చూస్తానని నమిత చెప్పింది. మరో అతిథి ఎస్‌వీ.శేఖర్‌ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. అయితే మనకు మంచి జరగుతుందంటే అది ఏ రోజు అయినా మంచిదేనని అన్నారు. చిత్ర నిర్మాత పీజీ.ముత్తయ్య మాట్లాడుతూ సినిమా గురించి ఏమీ తెలియకుండానే చెన్నైకి వచ్చానన్నారు. ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో చదువుతున్న సమయంలోనే సినిమా గురించి తెలుసుకున్నానని, ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన అన్నారు. కార్యక్రమంలో నటుడు అశోక్‌సెల్వన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement