త్రిష దరఖాస్తు చేశారట!
తమిళసినిమా: చెన్నై చిన్నది త్రిష దరఖాస్తు పరిశీలనకు వస్తుందా? ఈ బ్యూటీ చిరకాల ఆశ నెరవేరుతుందా? ఇలాంటి ప్రశ్నలపై కోలీవుడ్లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడో 19 ఏళ్ల కిందట జోడి చిత్రంలో సహ నటిగా తమిళ తెరకు పరిచయమైన నటి త్రిష. 2002లో మౌనం పేసియదే చిత్రం ద్వారా కథానాయకిగా మెరిశారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ బహుభాషా నటిగా పేరుగాంచారు.
కోలీవుడ్లో కమలహాసన్, విజయ్, విక్రమ్, తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, కన్నడంలో పునీత్రాజ్కుమార్ ఇలా పలు భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టారు. అయితే ఒక్క రజనీకాంత్తో మాత్రం నటించే అవకాశం ఇప్పటికీ రాలేదు. చాలా సార్లు త్రిష పలు వేదికలపై రజనీకాంత్తో ఒక్క సన్నివేశంలోనైనా నటించాలన్నది తన చిరకాల కోరిక అని బహిరంగంగానే వెల్లడించారు. ప్రస్తుతం రజనీ నటనకు స్వస్తి చెప్పడానికి సిద్ధం అవుతున్నారు. ఆయన నటించిన కాలా, 2.ఓ చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి.
తాజాగా కార్తీక్సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించే చిత్రమే చివరిదనే ప్రచారం జరగుతోంది. ఇందులో హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేయాలన్న లిస్ట్లో నటి త్రిష పేరు కూడా ఉందట. దీంతో త్రిష ఆశలు చిగురిస్తున్నాయి. అయితే దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్ త్రిష చిరకాల ఆశను నెరవేర్చగలరా? అన్నదే ప్రశార్థకంగా మారింది. త్రిష మాత్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందట. ఇప్పుటికే చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్లో దరఖాస్తు పెట్టుకున్నారట. అది పరిశీలనలోకి వస్తుందా? అన్నదే ఆసక్తిగా మారింది. త్రిష ప్రస్తుతం మోహిని, గర్జన, 1818, చతురంగవేట్టై, పరమపథం విళైయాట్టు అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారన్నది గమనార్హం.