సీపీఎస్‌ వద్దు..పెన్షన్‌ కావాలి

teachers darna for want to old pension system  - Sakshi

గళమెత్తిన ఉద్యోగ, ఉపాధ్యాయులు

ర్యాలీగా కలెక్టర్‌కు చేరిక

తరలివచ్చిన వేలాది మంది

చిలకలపూడి(మచిలీపట్నం): సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు గళమెత్తారు. మచిలీపట్నంలో పెన్షన్‌ సాధన సమితి తూర్పుకృష్ణాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, పెన్షనర్ల ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎన్జీవో హోమ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని, పలు దఫాలుగా పోరాటాలు చేసినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించటం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వెట్టిచాకిరీ చేస్తున్న ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ఆలోచన చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి అసెంబ్లీలో తీర్మానం చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల ఆందోళన ధర్మమైనది : పేర్ని
ఏపీ ఏన్జీవో అసోసియేషన్‌ తూర్పు కృష్ణా శాఖ సారధ్యంలో పెన్షన్‌ సాధన సమితి నేతృత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాల ఆందోళనకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన ధర్మమైనదని ఇందుకు ఉద్యోగుల సమస్యకు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు.  డీఏ పెంపుదల విషయంలో కేసీఆర్‌ను చూసి ఉద్యోగులకు ప్రకటించిన విధంగానే తెలంగాణా రాష్ట్రంలో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తున్నామని కేసీఆర్‌ ప్రకటిస్తే తప్ప ఆంధ్రరాష్ట్రంలో సీఎం చంద్రబాబు స్పందించే పరిస్థితి లేదని అర్ధమవుతోందన్నారు.

కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ తూర్పు కృష్ణా అధ్యక్ష,కార్యదర్శులు ఉల్లి కృష్ణ, దారపు శ్రీనివాస్, పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు మత్తి కమలాకరరావు, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పి సత్యనారాయణ, శోభన్‌బాబు, యూటీఎఫ్‌ నాయకులు కెఏ ఉమామహేశ్వరరావు, ఏపీటీఎఫ్‌ నాయకులు తమ్ము నాగరాజు, ఎస్టీయు నాయకులు కొమ్ము ప్రసాద్, డి చంద్రశేఖర్, బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు చేబ్రోలు శరత్‌చంద్ర, కైతేపల్లి దాస్, ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు జి కిషోర్‌కుమార్, పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు జీటీవీ రమణ, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జీవీ రామారావు, రామస్వామి, ఎన్జీవో సంఘ నాయకులు గౌరి, రమాదేవి, బి సీతారామయ్య, ఎల్‌వీ సూర్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆంజనేయటవర్స్‌ వద్ద ధర్నా
ఇబ్రహీంపట్నం: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం రద్దుచేయాలని రాష్ట్ర పెన్షన్‌ సాధన సమితి పిలుపుమేరకు క్యాపిటల్‌ సిటీ బ్రాంచి అమరావతి ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగసంఘాలు ఆంజనేయటర్స్‌ వద్ద శనివారం ధర్నా నిర్వహించాయి. క్యాపిటల్‌ సిటీ బ్రాంచి అమరావతి సంఘం రాష్ట్ర అ«ధ్యక్షుడు సీవీ.రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.మణికుమార్‌ మాట్లాడుతూ పెన్షన్‌ రద్దు కోసం దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. రాష్ట్రకోశాధికారి వీరేంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాల వల్ల ఉద్యోగులు నష్టపోతున్న ట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి సీహెచ్‌ అజయ్‌కుమార్, మహిళా అ«ధ్యక్షురాలు పీవీఎల్‌ఎస్‌.రత్న, ఏపీఎన్టీవో సంఘం కార్యదర్శులు నరసింహం, జగదీశ్వరరావు, తులసీరత్నం, కృపావ రం, క్యాపిటల్‌సీటీ బ్రాంచి కార్యదర్శి నాగభూష ణం, రాష్ట్ర ఉద్యోగుల సమైక్య సభ్యులు రాజ్యలక్ష్మీ, రాష్ట్ర అడిట్‌సంఘం ప్రధానకార్యదర్శి శ్రీధర్, రాష్ట్ర ఎకనామిక్, స్టాటిక్స్‌ సంఘం, పీఏవో, అగ్నిమాపక శాఖల యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top