ట్రంప్‌కు మళ్లీ షాక్‌

ట్రంప్‌కు మళ్లీ షాక్‌ - Sakshi


కింది కోర్టు ఆదేశాల నిలిపివేతకు నిరాకరించిన అప్పీలు కోర్టు

► నిషేధ ఉత్తర్వులపై తగిన ఆధారాలు చూపలేదన్న త్రిసభ్య ధర్మాసనం

► ‘సుప్రీంకోర్టులో చూసుకుందాం’ అంటూ ట్రంప్‌ ట్వీట్‌


శాన్  ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల పౌరులపై నిషేధ ఉత్తర్వుల్ని పునరుద్ధరించేందుకు శాన్ ఫ్రాన్సిస్కోలోని అప్పీల్‌ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. జాతీయ భద్రత కోసం కింది కోర్టు ఆదేశాల్ని కొట్టివేయాలంటూ ప్రభుత్వం చేసిన వాదనను అప్పీలు కోర్టులోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తోసిపుచ్చింది. ‘ప్రభుత్వం తన అప్పీలు సరైందని నిరూపించుకునేందుకు తగిన కారణాలు చూపలేదని నమ్ముతున్నాం. కార్యనిర్వాహక ఉత్తర్వులపై స్టే విధించడం వల్ల అమెరికాకు కోలుకోలేనంతగా నష్టం కలుగుతుందన్న వాదనకు సాక్ష్యాలులేవు. అందుకే కింది కోర్టు ఉత్తర్వులపై స్టే కోసం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్  తిరస్కరిస్తున్నాం’ అని తీర్పులో స్పష్టం చేసింది.



ఆధారాలు చూపకుండా ఇదేం పని: ‘కార్యనిర్వాహక ఉత్తర్వుల అవసరమేంటో చెప్పేలా ఆధారాలు సమర్పించకుండా... కోర్టులు తమ నిర్ణయాల్ని పరిశీలించకూడదంటూ ప్రభుత్వం వాదన వినిపించింది. ఆ వాదనతో మేం విభేదిస్తున్నాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇస్లామిక్‌ ఉగ్రవాదులు అమెరికాలో ప్రవేశించకుండా నిరోధించేందుకు ఈ ఉత్తర్వు ఉపకరిస్తుందన్న సర్కారు వాదనల్ని కోర్టు పరిగణించలేదు.  



ప్రమాదంలో అమెరికా భద్రత: ట్రంప్‌

తీర్పు తర్వాత ట్రంప్‌ స్పందిస్తూ... జాతీయ భద్రత ప్రమాదంలో ఉందంటూ ట్వీట్‌చేశారు. ‘సుప్రీంకోర్టులో చూసుకుందాం. ’ అని వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ‘ఇది రాజకీయ నిర్ణయం... ఈ విషయాన్నికోర్టులోనే తేల్చుకుంటాం. మేం కేసు గెలవబోతున్నాం’ అంటూ ట్రంప్‌ ధీమా వ్యక్తం చేశారు. తీర్పుపై అమెరికన్  కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ మాట్లాడుతూ... ‘రాజ్యాంగం విజయం సాధించింది.


ప్రజాస్వామ్యానికి, అమెరికన్లకే కాకుండా ప్రపంచానికి ఇది అద్భుతమైన గెలుపు’ అని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలతోనైనా ఉత్తర్వుల్ని రద్దు చేయాలంటూ ట్రంప్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు. ట్రంప్‌ తన ఉత్తర్వుల్ని రద్దు చేసి, దేశ భద్రత కోసం అందరికీ ఆమోదయోగ్య పరిష్కారంతో ముందుకు రావాలని డెమొక్రటిక్‌ సెనెటర్‌ చారెస్‌ షూమెర్‌ అన్నారు. కోర్టు తీర్పు రాజ్యాంగ విజయమని డెమొక్రటిక్‌ నేత నాన్సీ పెలోసీ పేర్కొన్నారు.



‘వలసల రద్దు’ జడ్జీలకు భద్రత పెంపు

వలసల రద్దుపై తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని విచారిస్తున్న న్యాయమూర్తులకు భద్రత పెంచారు. వీరికి ట్రంప్‌ మద్దతుదారులనుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలోనే శాశ్వతంగా భద్రత పెంచినట్లు తెలిసింది.



‘వన్  చైనా’ను గౌరవిస్తాం:  ట్రంప్‌

తైవాన్ పై సార్వభౌమాధికారం చైనాదేనని అంగీకరించే ‘వన్  చైనా’ విధానాన్ని గౌరవిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. ఈ విధానాన్ని పున:సమీక్షించాల్సిందే ప్రకటిస్తూ వస్తున్న తాజాగా మాట మార్చారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు తొలిసారి ఫోన్  చేసిన ఆయన ఈ విషయం వెల్లడించారు. ట్రంప్, జిన్ పింగ్‌ మధ్య ఫోన్ సంభాషణ సుహృద్భావ వాతావరణంలో సాగిందని వైట్‌హౌస్‌ తెలిపింది. అఫ్గానిస్తాన్  అధ్యక్షుడు అష్రఫ్, ఇరాక్‌ ప్రధాని అబదీతోనూట్రంప్‌ గురువారం ఫోన్ లో సంభాషించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top