భారత్‌తో అణు యుద్ధానికైనా రెడీ

Pakistan is ready for another war with India over Kashmir - Sakshi

కశ్మీర్‌పై ఎంతవరకైనా వెళ్తాం

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌ విషయంలో భారత్‌తో అణుయుద్ధానిౖకైనా సిద్ధమేనని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ మరోసారి బెదిరింపులకు దిగారు. సోమవారం ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. ‘కశ్మీర్‌ పరిస్థితులు యుద్ధానికి దారి తీస్తే.. గుర్తుంచుకోండి రెండు దేశాల వద్దా అణ్వాయుధాలు ఉన్నాయి. కశ్మీర్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. కశ్మీర్‌ కోసం ఎంతవరకైనా వెళతాం. అంతర్జాతీయ సమాజం ఇప్పుడు బాధ్యత తీసుకోవాలి, లేదా పాక్‌ ఏదైనా చేయగలుగుతుంది’అని స్పష్టంచేశారు.

అంతర్జాతీయంగా జరిగే ప్రతి సమావేశంలోనూ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తుతానన్నారు. ఈ విషయంలో భారత్‌తో చర్చలు జరపడానికి ప్రయత్నించినా సరైన స్పందన రాలేదని తెలిపారు. భారత్‌లో ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంతో చర్చలు జరపవచ్చని భావించానని అయితే మోదీ ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దుతో చారిత్రాత్మక తప్పు చేసిందని అన్నారు. ఈ క్రమంలో భారత్‌ తమ సొంత రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను, ఐక్యరాజ్యసమితి సూచనలను తుంగలో తొక్కిందని ఆరోపించారు.

సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానన్నారు. ముస్లిం దేశాలు పాక్‌కు మద్దతివ్వడం లేదన్న విషయంపై స్పందిస్తూ.. ‘ఆర్థిక సంబంధాల వల్ల వారు ముందుకు రాకపోవచ్చు. కానీ వారంతా కచ్చితంగా కాలంతోపాటు కలిసి రావాల్సిందే. కశ్మీరీలను కాపాడతామని ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఇది ఇప్పుడు వారి బాధ్యత. పుల్వామా వంటి దాడులను సాకుగా చూపి కశ్మీర్‌ అంశం నుంచి అంతర్జాతీయ సమాజ దృష్టిని మార్చే పనిలో భారత్‌ ఉంది’అన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top