చైనాలో ముస్లింల బాధలు పట్టవా? | Alice Wells question to Pak in UN | Sakshi
Sakshi News home page

చైనాలో ముస్లింల బాధలు పట్టవా?

Sep 28 2019 3:02 AM | Updated on Sep 28 2019 9:10 AM

Alice Wells question to Pak in UN - Sakshi

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాల ప్రతినిధుల సభ సాక్షిగా పాకిస్తాన్‌కు అగ్రరాజ్యం అమెరికా గట్టి షాక్‌ ఇచ్చింది. కశ్మీర్‌లో ముస్లింలకు మానవ హక్కులు కరువయ్యా యంటూ పదేపదే ప్రస్తావించే పాకిస్తాన్‌.. చైనా వ్యాప్తంగా ముస్లింలపై కొనసాగుతున్న నిర్బం ధంపై ఎందుకు పెదవి విప్పడం లేదని నిలదీ సింది. అమెరికా తాత్కాలిక సహాయ కార్యదర్శి (దక్షిణ, మధ్య ఆసియా ప్రాంత వ్యవహారాలు) అలిస్‌ వెల్స్‌ శుక్రవారం ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కశ్మీరీల హక్కుల గురించి మాట్లాడే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. చైనాలోని జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని లక్షలాది మంది ఉయ్‌గుర్‌ ముస్లింలు, టర్కిష్‌ భాష మాట్లాడే ముస్లింలను నిర్బంధించినా పట్టించుకోవడం లేదన్నారు. ‘చైనా ప్రభుత్వం ఉయ్‌గుర్‌ ప్రావిన్స్‌లోని 10 లక్షల మంది ముస్లింలను నిర్బంధంలో ఉంచడంపైనా పాక్‌ అదే స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయాలి.

మానవ హక్కులపై కేవలం కశ్మీరీల గురించి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో ముస్లింలపై సాగు తున్న నిర్బంధాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. చైనాలో ముస్లింలు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులను వెలుగులోకి తెచ్చేందుకు ఐరాస యంత్రాంగం ప్రయత్నిస్తోంది’అని తెలిపారు. భారత్‌–పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు పాక్‌ నిజాయతీగా తీసుకునే చర్యలే కీలకమని అలిస్‌ పేర్కొన్నారు.   ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) కార్యాచరణకు అనుగుణంగా నడుచుకోవడంతోపాటు ఉగ్ర నేతలు హఫీజ్‌ సయిద్‌ మసూద్‌ అజార్‌ వంటి వారిపై వారిపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్రిక్తతల కారణంగా ఈ ప్రాంతం వెనుకబాటుకు గురవుతోందని తెలిపారు. 130 కోట్ల మంది వినియోగదారులున్న అతిపెద్ద మార్కెట్‌ భారత్‌ పొరుగునే ఉన్నా పాకిస్తాన్‌ సద్వినియోగం చేసుకోలేకపోతోందన్నారు. 

సత్వరమే ఆంక్షలు ఎత్తేయాలి 
సాధ్యమైనంత త్వరగా కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తేయాలని, ఆంక్షలను తొలగించాలని, నిర్బంధంలోకి తీసుకున్నవారిని విడుదల చేయాలని అనంతరం ఆమె మీడియా భేటీలో కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement