
మూడేళ్ల బాలిక అవయవదానం
చైనాలో బ్రెయిన్ ట్యూమర్తో మరణించిన మూడేళ్ల బాలిక చేసిన అవయవ దానం.. ఐదు ప్రాణాలు కాపాడింది.
చైనాలో బ్రెయిన్ ట్యూమర్తో మరణించిన మూడేళ్ల బాలిక చేసిన అవయవ దానం.. ఐదు ప్రాణాలు కాపాడింది. ఆ బాలిక గుండె, కాలేయం, మూత్రపిండాలు, కార్నియా.. ఇలా అన్ని ప్రధాన అవయవాలను దానం చేశారు. లియు జింగ్యావో అనే ఆ బాలికకు మెదడులో ప్రమాదకరమైన కణితి ఉన్నట్లు ఈ ఏడాది ఆరంభంలో గుర్తించారు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రతి వైద్యుడూ మాత్రం పరిస్థితి చెయ్యి దాటిపోయిందనే చెప్పారు.
అమ్మాయి తల కూడా విపరీతంగా వాయడంతో కనీసం మాట్లాడటం కూడా కుదరలేదు. చివరకు ఆమె మంచానికే పరిమితం అయిపోయింది. దాంతో ఆమె తండ్రి లియు జియబావో ఆమె అవయవాలను దానం చేయాలనుకున్నారు. అదే చెబితే.. ఆమెకు తొలుత అర్థం కాలేదు. చివరకు నీ శరీరంలోని అంగాలు ఇతరుల ప్రాణాలు కాపాడతాయని చెబితే వెంటనే సరేనంది. చివరకు ఆమె ఈనెల 23న ఆస్పత్రిలో మరణించింది. వెంటనే ఆమె శరీరంలోని ముఖ్యమైన అవయవాలను బయటకు తీశారు. అయితే, కొన్ని కొన్ని అవయవాలు మాత్రం మరీ చిన్నవి కావడంతో దానం చేయడానికి కుదరలేదు. చివరకు ఆమె చేసిన ఈ దానంతో ఐదుగురి ప్రాణాలను కాపాడగలిగినట్లు వైద్యులు చెప్పారు.