ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంవత్సర తొలి పండగ.. అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్థిల్లాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
ఏడాదంతా సకాలంలో వానలు పడి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. పాడి పంటలతో రైతులు వర్థిల్లాలని, పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని అన్నారు. షడ్రుచుల ఉగాది తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నింపి, ఆనందం తీసుకురావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.