
రోహిత్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) పీహెచ్డీ విద్యార్థి రోహిత్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు.
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) పీహెచ్డీ విద్యార్థి రోహిత్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఆయన ఈ రోజు సాయంత్రం ఉప్పల్ లోని రోహిత్ నివాసానికి వెళ్లారు. రోహిత్ సస్పెన్షన్, ఆత్మహత్యకు గల కారణాలను వైఎస్ జగన్ ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ విషయాలు చెబుతూ రోహిత్ తల్లి రాధిక కన్నీరుమున్నీరుగా విలపించారు.
రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే కఠినంగా శిక్షించాలని జగన్ డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్తో పాటూ పార్టీ నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విభాగం చైర్మన్ మేరుగ నాగార్జునలు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా రోహిత్ తల్లి రాధిక కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, చిన్నప్పటి నుంచి రోహిత్ అన్నింటిలో ముందంజలో ఉండేవాడని ... కొద్దిరోజుల క్రితం ఇంటికి వచ్చిన రోహిత్ త్వరలో శుభావార్త వింటారని చెప్పాడని ఆమె రోదించారు. రోహిత్ మృతి వెనక కుట్ర దాగి ఉందని తల్లి రాధిక ఆరోపించారు. తన కుమారుడి మృతికి వీసీనే కారణమని, అతడిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.