వైభవంగా వినాయక నిమజ్జనం | vinayaka immersion at hyderabad | Sakshi
Sakshi News home page

వైభవంగా వినాయక నిమజ్జనం

Sep 27 2015 7:54 PM | Updated on Sep 4 2018 5:16 PM

వైభవంగా వినాయక నిమజ్జనం - Sakshi

వైభవంగా వినాయక నిమజ్జనం

జంట నగరాల్లో వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగుతోంది.

హైదరాబాద్:  జంట నగరాల్లో వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగుతోంది.  లక్షలాది మంది భక్తులు గణనాథుడిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రానికి దాదాపు 26 వేల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నాయి. మహానగరం అంతా డప్పులు, డ్యాన్సులు, డీజేలతో సందడిగా మారింది. ముఖ్యంగా ట్యాంక్బండ్, హుస్సేన్ సాగర్ ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ట్యాంక్బండ్తో పాటు 25 చెరువుల్లో వినాయకుడి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. తొమ్మిది ప్రధాన మార్గాల నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ త్రిశక్తిమయ మోక్ష గణపతి నిమజ్జనం సోమవారం ఉదయానికి పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాసేపట్లో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన యాత్ర ప్రారంభంకానుంది.


వినాయక నిమజ్జనం కోసం 25 వేల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.  ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, తమిళనాడు పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు కమాండింగ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా 400 సీసీ కెమెరాలతో మానిటర్ చేస్తున్నారు. గతంలో ఇబ్బందులు ఎదురైన ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి... నిమజ్జనం దారిలోని ప్రతి కూడాలిలో సీసీ కెమెరాలు అమర్చారు. ఎలాంటి ఘటన జరగకుండా కమాండింగ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ జంట నగరాల్లో పలుప్రాంతాల్లో సందర్శించి ఏర్పాట్లును సమీక్షించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి నగరంలో పటిష్ట పోలీసు బలగాలను ఉంచారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా సమాచారం అందించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement