బాబు పాపాల పుట్ట బద్దలవుతుంది | Sakshi
Sakshi News home page

బాబు పాపాల పుట్ట బద్దలవుతుంది

Published Wed, Apr 6 2016 1:39 AM

బాబు పాపాల పుట్ట బద్దలవుతుంది - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం

 సాక్షి, హైదరాబాద్: నల్లధనంపై పనామా పత్రాలు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాల పుట్ట కూడా త్వరలో బద్దలవుతుందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. విదేశాల్లో నల్లధనాన్ని దాచిపెట్టుకోవడంలో చంద్రబాబు ఘనుడనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. 20 ఏళ్లుగా ఆయన విదేశాల్లో తిరుగుతూ ఈ పని చేశారని ఆరోపించారు. వాసిరెడ్డి పద్మ మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పనామా పత్రాలపై ‘సిట్’ బృందంతో దర్యాప్తు జరిపిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్యను తమ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తోందని అన్నారు. పనామా పత్రాల్లో దేశ విదేశీ ప్రముఖుల బాగోతాలు వెల్లడయ్యాయని, తీగ లాగుతున్నారు కనుక డొంకంతా కదిలి చంద్రబాబు పేరు కూడా బయటకు వస్తుందని చెప్పారు.

 తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం నోరు విప్పాలి : కృష్ణా, గోదావరి నదులపై భారీస్థాయిలో ప్రాజెక్టులు కట్టబోతున్నామని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడమే కాక, అన్ని పత్రికల్లో ప్రకటనలు జారీ చేసిందని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లపై ఏపీ వైఖరి ఏమిటనే  దానిపై చంద్రబాబు నోరు విప్పడం లేదని విమర్శించారు.

Advertisement
Advertisement