బొబ్బిలి ప్రజల తీర్పును వమ్ము చేస్తారా? | Vasireddy Padma question to Sujaya Krishna | Sakshi
Sakshi News home page

బొబ్బిలి ప్రజల తీర్పును వమ్ము చేస్తారా?

Apr 21 2016 2:20 AM | Updated on May 29 2018 4:23 PM

బొబ్బిలి ప్రజల తీర్పును వమ్ము చేస్తారా? - Sakshi

బొబ్బిలి ప్రజల తీర్పును వమ్ము చేస్తారా?

‘‘బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు మిమ్మల్ని జగన్ మనిషిగా ఉండమని తీర్పునిస్తే టీడీపీలోకి ఫిరాయిస్తారా?

♦ జగన్ మనిషిగా ఉండమని వారు తీర్పిస్తే.. ఫిరాయిస్తారా?
♦ సుజయ కృష్ణను నిలదీసిన వాసిరెడ్డి పద్మ
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు మిమ్మల్ని జగన్ మనిషిగా ఉండమని తీర్పునిస్తే టీడీపీలోకి ఫిరాయిస్తారా? నిజంగా మీకు రాజవంశీకులమనే పౌరుషం, నైతికత ఉంటే, ఎన్నికల్లో పోటీ చేసి గెలవగలమనే ధైర్యముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి’’ అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు సోదరులపై ధ్వజమెత్తారు. ఆమె బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాము రాజవంశీకులమని, నేలబారు రాజకీయాలు చేయబోమని ఘనమైన మాటలు చెప్పిన సుజయ్‌కృష్ణ టీడీపీలో చేరడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

బొబ్బిలిలోనో, మరొకచోటనో 100 లేదా 150 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించుకునే స్వార్థంతోనో, మంత్రిపదవి కోసమో ఫిరాయించి ఉండొచ్చు కానీ జగన్ పక్షాన నిలబడమని ఓట్లేసిన మీ బొబ్బిలి నియోజకవర్గ ప్రజల మాటేమిటని ప్రశ్నించారు.  పచ్చకండువాలు కప్పుకుంటేతప్ప చంద్రబాబు ఆ నియోజకవర్గంలోని ప్రజలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వరనే విషయం చెబుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రమంత్రిగా ఉంటూ రాష్ట్రానికి వెంట్రుకవాసి సాయం తీసుకురాలేని అశోక్ గజపతిరాజు కూడా జగన్ గురించి ఆవేశంగా మాట్లాడ్డం విడ్డూరమన్నారు. బొబ్బిలికి చెందిన తాండ్రపాపారాయుడు పౌరుషానికి మచ్చతెచ్చేలా సుజయ్‌కృష్ణ ఈరోజు పార్టీ మారారని ఆమె విమర్శించారు. ఉప్పు, నిప్పులాగా వైరంతో ఉన్న రెండు రాజకుటుంబాలమధ్య దళారీలాగా అశోక్‌గజపతిరాజు వ్యవహరించి.. బుస్సీదొర పక్కన చేరినట్లు వ్యవహరించారని దుయ్యబట్టారు.
 
 జన్మదినం నాడైనా మంచి పనులు చేయరా..
 ఎవరైనా జన్మదినం రోజు మంచి పనులు చేస్తారని, అలాంటిది చంద్రబాబు తన పుట్టినరోజునాడే ఒక పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేకు పచ్చకండువా వేసి అనైతిక చర్యలకు పాల్పడ్డారని పద్మ విమర్శించారు. గతంలో వైస్రాయ్ హోటల్ సాక్షిగా ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన బాబు ఇపుడూ ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని లోబర్చుకుంటున్నారన్నారు. ఆయనకు ఏనాడూ నిజాయితీతో రాజకీయాలు చేస్తారన్న పేరు లేదన్నారు.నిజాయితీగా  రాజకీయాలు చేస్తున్న తమ అధినేత జగన్‌పైన అందరూ గోముఖ వ్యాఘ్రాల్లాగా కుతంత్రాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకునేముందు  వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధపడాలని డిమాండ్‌చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement