ఐలయ్య సామాజిక ఉగ్రవాది | Trs leaders fires on Kancha ilaiah | Sakshi
Sakshi News home page

ఐలయ్య సామాజిక ఉగ్రవాది

Sep 18 2017 3:31 AM | Updated on Sep 19 2017 4:41 PM

ఆర్యవైశ్యులను కించపరిచేలా పుస్తకాన్ని రాసిన కంచ ఐలయ్య సామాజిక ఉగ్రవాది అని టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ ఎంపీ, ఎమ్మెల్యేల మండిపాటు 
 
సాక్షి, హైదరాబాద్‌: ఆర్యవైశ్యులను కించపరిచేలా పుస్తకాన్ని రాసిన కంచ ఐలయ్య సామాజిక ఉగ్రవాది అని టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించారు. ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, బిగాల గణేశ్‌ గుప్త, గువ్వల బాలరాజు, హన్మంత్‌ షిండే, వేముల వీరేశం అసెంబ్లీ ఆవరణలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’అని పుస్తకం రాసిన ఐలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కులాన్ని, మతాన్ని కించపరిచే హక్కు రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదని, శాంతి కాముకులుగా ఉంటూ, సామాజిక సేవలో పాలుపంచుకుంటున్న ఆర్యవైశ్యులను అవమానపరచడం సరికాదని హితవుపలికారు. కులాల మధ్య చిచ్చుపెడుతున్న ఐలయ్య ఐసిస్‌ ఉగ్రవాదుల కన్నా ప్రమాదకారన్నారు. ఇలాంటి పుస్తకాలు రాయడం ద్వారా రాష్ట్రంలో పత్తాలేని పార్టీలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. వెంటనే పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్‌ 2న జరుపుకుంటున్నామని, సెప్టెంబరు 17న జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement