
అభిప్రాయం
మునుపెన్నడూ జరగని విధంగా ఒక చిన్న, కొత్త రాష్ట్రమైన తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. నాకు గుర్తున్నంతవరకు ఇంతకు ముందు బెంగళూరులో ఇటువంటి పోటీ ప్రయత్నాలు ప్రారంభించగానే రైట్ వింగ్ వ్యతిరేకులు పెద్ద రాద్ధాంతం చేశారు. చివరికి అవి ఆగిపోయాయి. అది 1996 నాటి చరిత్ర. తెలంగాణలో కూడా కమ్యూనిస్టుల మహిళా సంఘాలు వ్యతిరేకత చూపాయి.
కానీ కొద్దిపాటి వ్యతిరేకతతో ఆగి పోయాయి. బీజేపీ/ఆరెస్సెస్ మహిళా సంఘాలు గానీ, ముస్లిం స్త్రీలు గానీ బెంగళూరులో చేసిన వ్యతిరేక హడావిడి చెయ్యలేదు. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలు అవసరమా, లేదా? అవి స్త్రీ శరీర ఎక్స్పోజర్ తంతులా, లేక వారి శరీర అందాన్నీ, శక్తి యుక్తుల్నీ, తెలివితేటలనూ పెంచేవా అనే అంశంపై నేను ఇక్కడ చర్చించదలచుకోలేదు.ఒక్కటి మాత్రం నిజం. ఈ రెండు స్త్రీల పోటీలలో చాలా దేశాలు పాల్గొంటాయి. కొన్ని పాల్గొనవు. మొత్తం ముస్లిం దేశాలు పాల్గొనవు.
తెలంగాణలో ఈ పోటీ జరిగే వరకు నేను ఈ పోటీలను అంతగా పరిశీలించలేదు. ఈ పోటీ ఇంత చిన్న, కొత్త రాష్ట్రంలో జరిగినందువల్ల, ఈ వివిధ దేశాల యువతులు జిల్లా పర్యాటక ప్రాంతాలు, హైదరాబాదులోని వివిధ ప్రాంతాలు తిరిగి చూడటం, రకరకాల తిండి తినడం, కల్లు తాగడం (నీరా), వీళ్ళల్లో మాంసాహార, శాకాహార తిండి విభజన లేకపోవడం, తెలంగాణ మంత్రులు, అధికారులు పక్కా తెలుగు మీడియాను (ముఖ్యంగా ఇంగ్లిష్ వ్యతిరేక ‘ఈనాడు’ గ్రూపు మీడియా ప్రతినిధులను) కూర్చుండబెట్టి ఉపన్యాసాలివ్వడం నాకు నచ్చింది. నాగార్జున సాగర్లో నల్లగొండ కలెక్టర్ ఉపన్యాసం నేను విన్నాను.
వందకు పైగా దేశాల నుండి యవ్వనంలో ఉన్న అమ్మా యిలూ, వారికి మద్దతుగా వచ్చిన అధికారులూ, జడ్జీలూ, కార్య క్రమ నిర్వాహకులూ ఇంకా ఇంగ్లిష్ వచ్చినవారై ఉండాలనేది ఇందులో స్పష్టంగా కనిపించింది. ఈ పోటీలో అతి చిన్న చిన్న వెనుకబడిన దేశాలకు చెందిన ఆఫ్రికా, ఆసియా, యూరప్ వంటి ఖండాలకు చెందిన అమ్మాయిలు పాల్గొన్నారు. వారందరూ పరస్పరం ఇంగ్లిష్లో మాట్లాడుకుంటే తప్ప తమలో తమకు కమ్యూనికేషన్ ఉండదు.
ఆయా దేశాల్లో ఈ అమ్మాయిలంతా ఏ ఆర్థిక వర్గానికి చెందినవారై ఉంటారు? ఆయా దేశాల్లోని శ్రమ జీవుల్లోని ఆడపిల్లలంతా వీరి లాగా శరీర పోషణలో ఉంటూ ఇంగ్లిష్లో చదువుకోగలిగినవారై ఉంటారా? మన దేశంలో ఇప్పటి వరకు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతలుగా గెలిచి వచ్చిన స్త్రీలను చూస్తే వీరంతా బాగా ధనిక కుటుంబాల్లో పుట్టి మంచి డబ్బుల సంచుల ప్రైవేట్ సూళ్ళలో చదివిన వారే. ఐశ్వర్యారాయ్ కానీ, ప్రియాంకా చోప్రా కానీ, సుస్మితా సేన్ కానీ, ప్రస్తుత పోటీల్లో పాల్గొంటున్న నందినీ గుప్తా కానీ అగ్ర కులాల వాళ్ళు, ధనవంతులు, మంచి ఇంగ్లిష్ మీడియం సూళ్ళలో చదువు కున్నవాళ్ళు.
స్త్రీదైనా, పురుషునిదైనా శరీర అందం వర్గం, కులాలపై ఆధారపడి ఉంటుందా? భారతదేశంలోని శూద్ర– బీసీ, దళిత, ఆదివాసీ స్త్రీలు ఈ అందాల పోటీల్లో పాల్గొనగలిగే అందం వారికి లేదా? ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితిలో అందాల పోటీలు ఆహారం, శరీర ఆకృతి, వేసుకునే బట్టల వైనం, ఇంగ్లిష్లో ప్రశ్న లకు సమాధానం చెప్పే జ్ఞానంతో ముడివడి ఉన్నాయి. రంగు సమస్య ఒకప్పుడు తీవ్రంగా ఉండేది.
ప్రస్తుత ప్రపంచ సుందరి పోటీలో ‘మిస్ వరల్డ్’గా నిలిచిన ఓపల్ సుచాతా చిన్న దేశమైన థాయ్లాండ్కు చెందిన అమ్మాయి. ఆమె తరువాతి స్థానంలో నిలి చిన హసెత్ డెరెజె అడ్మస్సు ఇథియోపియాకూ, మూడవ స్థానంలో నిలిచిన మాజా క్లాజ్డా పోలాండ్కు, నాల్గవ (థర్డ్ రన్నర్ అప్) స్థానంలో నిలిచిన అవురెలీ జోచిమ్ మార్టినిక్కూ చెందిన యువ తులు. ఇథియోపియా నల్లజాతి అమ్మాయి రెండో స్థానంలో ఉందంటే రంగు, అందం నిర్వచనాలు మారుతున్నాయని అర్థం.
చివరి దశలో జరిగిన ఇంటెలిజెన్స్ టెస్ట్ ప్రశ్నలను, వాటికి వారు ఇచ్చిన సమాధానాలను నేను జాగ్రత్తగా విన్నాను. ఈ 108 దేశాల అమ్మాయిలు తమలో తాము ఇంగ్లిష్లో మాట్లాడుకోవడమే కాదు, వారి మే«ధా శక్తిని పరీక్షించే ప్రశ్నలన్నీ ఇంగ్లిష్లోనే అడుగు తారు. వారు ఇంగ్లిష్లోనే సమాధానం చెప్పాలి.
థాయ్లాండ్, ఇథియోపియా, పోలాండ్ వంటి అమ్మాయిలు తమ తమ భిన్నమైన యాసలలో సమాధానాలు చెప్పారు. భాష స్టైల్కూ, యాక్సెంట్కూ కాక... ఆ సమాధానం కంటెంట్కు మార్కులిచ్చినట్లు భావిస్తున్నాను. నలుగురు ఫైనలిస్టుల సమా ధానాలూ నన్ను ఆశ్చర్యపర్చాయి. ఒక అమ్మాయిని తెలంగాణలో తన అనుభవం గురించి అడిగారు. ఒకామెను ప్రపంచంలోని బీదలకు, దిక్కులేని వారికి నీవేమి చేస్తావని అడిగారు.
ఇథియో పియా అమ్మాయికి ప్రశ్న ముందు అర్థం కాలేదు. మళ్లీ అడగమని కోరి ఆమె చెప్పిన సమాధానం బ్రిలియంట్. ఆమెది ఆఫ్రికన్ యాస. ఆమె నలుపు, అందం, ఆఫ్రికన్ జాతివి. కానీ ఆమె ఇంగ్లిష్ ప్రశ్నకిచ్చిన రిప్లై యూనివర్సల్. ఆమెలో గొప్ప మే«ధా శక్తి ఉంది. ఆ శక్తి ఆమెను ప్రపంచ రెండో అందగత్తెను చేసింది.
భారతదేశంలోని ఆదివాసులు, దళితులు, శూద్ర బీసీలు ఆమెలాగే ఉంటారు. కానీ వీరి ఆడపిల్లలకు ఆమెలాంటి ఇంగ్లిష్ విద్య లేదు. ప్రపంచ స్త్రీలతో పోటీపడే అవకాశం లేదు. ఆంధ్ర ప్రదేశ్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యను పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చాక ఆదివాసీ, దళిత, బీసీ అమ్మాయిలు సైతం మిస్ వరల్డ్ పోటీ గురించి ఆలోచించే అవకాశం వచ్చింది.
తెలంగాణలో గురుకులాల్లో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో చదివే అమ్మాయిలు అటువంటి కల కనొచ్చు. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల్లాగా ఐక్యూస్, మానవత్వ విలువలతో కూడిన సమాధానాలు రాబట్టడానికి 108 దేశాల నుండి వచ్చిన అమ్మా యిలను పరీక్షకు పెట్టే మరో వేదిక లేదు. ఇంటర్నేషనల్ గేమ్స్ ఎన్ని ఉన్నా అవి ఐక్యూస్నీ, అందులో పాల్గొనే ఆటగాళ్లందరి జ్ఞానాన్ని పరీక్షించే ఆట లేదు. మిస్ వరల్డ్ లాంటి పోటీ ఇన్ని దేశాల్లో ఇంగ్లిష్ భాష మనుగడలో లేకపోతే సాధ్యం కాదు.
వలసవాదానంతర ప్రపంచంలో వచ్చిన ఒక గొప్ప అను కూల మార్పు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇంగ్లిష్ భాష మాట్లాడే ఒక వర్గం ఎదగడం. ఈ భాష ఆడపిల్లలకు అందుబాటులోకి రావడం వల్ల ఈ పోటీలు సాధ్యమయ్యాయి.ఈ పోటీ వ్యతిరేకత ఈ దేశంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చి, క్రమంగా మారాల్సిన స్థితిలోకి నెట్టబడ్డాక హిందూత్వ శక్తులు ఈ పోటీని వ్యతిరేకించడం తగ్గించుకున్నాయి. కమ్యూనిస్టు శక్తులు వలసవాద వ్యతిరేకతలో భాగంగా మిస్వరల్డ్ పోటీలను వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణలో కూడా వ్యతిరేకించాయి.
అదే ధోరణి ప్రభుత్వ సూళ్ళలో ఇంగ్లిష్ మీడియంపై కూడా వ్యక్తపరుస్తున్నాయి. కానీ ఈ దేశంలోనే అగ్ర కుల ధనికులు తమ ఆడపిల్లల్ని పెద్ద ఖర్చుతో ఇంగ్లిష్ మీడియంలో చదివించి వాళ్ళు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అవుతూ ప్రపంచ దేశాలలో పర్య టిస్తూ, డబ్బు సంపాదిస్తుంటే; సినిమా యాక్టర్లు అయ్యి కోట్లు గడిస్తుంటే ఏమీ చెయ్యలేని స్థితిలో చూస్తూ ఉంటున్నారు.
నందినీ గుప్తా లాంటి ఒక ధనవంతమైన అమ్మాయి కాక, ఒక ఆదివాసీ లేదా దళిత లేదా బీసీ అమ్మాయి ఆ స్థానంలో ఉండాలంటే మంచి ఇంగ్లిష్ విద్య కావాల్సిందే కదా! మారుతున్న ప్రపంచంతోపాటు భారతదేశపు బీద ప్రజల జీవితం, ఆశలు మారాలని కోరుకోవాలి గానీ ఇక్కడే ఆగాలని కోరుకోకూడదు.
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు