
మీ సేవలకు సలాం
జీహెచ్ఎంసీలో రోడ్లను ఊడుస్తూ, చెత్తను శుభ్రం చేస్తున్న 20 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు
20 వేల పారిశుద్ధ్య కార్మికులకు ఇళ్లు
త్వరలో వేతనాలు పెంచుతాం: సీఎం
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో రోడ్లను ఊడుస్తూ, చెత్తను శుభ్రం చేస్తున్న 20 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు (సఫాయి కర్మచారులు)పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వరాల జల్లు కురిపించారు. వీరికి డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వేతనాల్లో కోత విధించైనా వీరి వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్ కాలనీ, ఎన్బీటీ నగర్ బస్తీవాసులతో సీఎం వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సేవలు తల్లిదండ్రుల సేవలతో సమానమన్నారు. అంతకుముందు ఇందిరానగర్ కాలనీలోని పురాతన ఇళ్లను పరిశీలించిన కేసీఆర్.. కాలనీలోని 176 కుటుంబాల వారికి వెంటనే ఇళ్లు కట్టిస్తామన్నారు. బుధవారం ఉదయమే జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి పరిశీలిస్తారని తెలిపారు.
గతంలో కట్టిన ఇళ్లు డబ్బాల మాదిరిగా ఉన్నాయని, ఇప్పుడలా కాకుండా సౌకర్యవంతంగా నిర్మిస్తామని చెప్పారు. కొత్తగా క ట్టబోయేవి 560 నుంచి 570 చ.అ. విస్తీర్ణంలో వస్తాయన్నారు. ఒక్కో ఇంటికి దాదాపు రూ. 9 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఇక్కడ ఒకటిన్నర ఎకరాల కంటే కొంచెం ఎక్కువ స్థలం ఉందని... ఐదారు అంతస్తుల్లో కట్టవచ్చునని... లిఫ్ట్ పెట్టిస్తానని చెప్పారు. ఐదారు అంతస్తులు కావాలో లేక ఇప్పుడున్న తరహాలో జీప్లస్ 2 పద్ధతిలో కావాలో మీరే ఒక నిర్ణయానికి రావాలని సూచించారు.లిఫ్ట్ నిర్వహణ కు, కరెంట్ చార్జీలు చెల్లించేందుకు ప్రజలపై భారం పడకుండా కింద కొన్ని దుకాణాలకు అద్దెకిస్తామన్నారు. ‘మీ నిర్ణయమేదో రెండు రోజుల్లో చెబితే నేనే వచ్చి శంకుస్థాపన చేస్తా. నాలుగైదు నెలల్లో మళ్లీ వచ్చి కొబ్బరికాయ కొట్టి మిమ్మల్ని కొత్త ఇళ్లలోకి పంపిస్తా’నన్నారు. వీరితో పాటు దరఖాస్తులిచ్చిన అందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఐదు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, ప్రస్తుతం ఉంటున్న ఇళ్లు ఖాళీ చేసి పక్కనే చిన్న ఇళ్లు కిరాయికి తీసుకోవాల్సిందిగా సూచించారు.
మీ సమస్యలు తెలుసమ్మా....
బస్తీలో సమావేశం జరుగుతుండగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం మహిళ ఒకరు వినతిపత్రం ఇవ్వబోగా.. ‘మీ సమస్యలు తెలుసమ్మా..’ అన్నారు. అనంతరం మాట్లాడుతూ నగరంలో 20వేల మంది సఫాయి కర్మచారుల జీతాలను పెంచుతామన్నారు. సమావేశం కాగానే అధికారులతో మాట్లాడి దానిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. వారికి సఫాయి కర్మచారి కాలనీ కట్టిస్తానని హామీ ఇచ్చారు.