శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట | Relief in the High Court to srilaksmi | Sakshi
Sakshi News home page

శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట

Jun 3 2017 2:56 AM | Updated on Sep 5 2017 12:40 PM

శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట

శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట

దాల్మియా సిమెంట్స్‌కి సున్నపురాయి లీజు మంజూరుకు సంబంధించిన కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట దక్కింది.

నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాస ఘాతుకం కేసు కొట్టివేత
 
సాక్షి, హైదరాబాద్‌: దాల్మియా సిమెంట్స్‌కి సున్నపురాయి లీజు మంజూరుకు సంబంధించిన కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెపై ఐపీసీలోని 120బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం), 409 (విశ్వాస ఘాతుకం) సెక్షన్ల కింద నమోదు చేసిన కేసును కొట్టివేసింది. అయితే అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌)లోని సెక్షన్‌ 13 (ప్రభుత్వ ఉద్యోగి దుష్ప్రవర్తన) కింద నమోదుచేసిన కేసును కొట్టివేసేందుకు నిరాక రించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకర్‌రావు గురువారం తీర్పునిచ్చారు.

కడప జిల్లా మైలవరం మండలం పరిధిలో 408 హెక్టార్ల సున్నపురాయి గనులను రాష్ట్ర ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్‌కు లీజుకిచ్చింది. ఈ లీజు మంజూరులో అప్పట్లో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది.ఆమెను 5వ నిందితురాలిగా చేర్చింది. దీనిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకర్‌రావు గురువారం తీర్పు వెలువరించారు. ఈ వ్యవహారంలో నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాస ఘాతుకానికి పాల్పడారనేందుకు ప్రాథమిక ఆధారాలేమీ లేవని స్పష్టం చేశారు. ఐపీసీ సెక్షన్ల కింద కేసును విచారణకు స్వీకరిస్తూ సీబీఐ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13 కింద నమోదు చేసిన కేసును మాత్రం కొట్టివేసేందుకు నిరాకరించారు. ఈ సెక్షన్‌ కింద నమోదు చేసిన అభియోగాలు మినహా.. మిగతా సెక్షన్ల కింది కేసుల్లో ఏవైనా అభియోగాలు నమోదు చేసి ఉంటే అవేవీ చెల్లవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement