ఆరోపణలు ఎదుర్కొంటున్న పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ ఎస్ఐ కోటేశ్వరరావు అజ్ఞాతంలో ఉన్నాడు.
హైదరాబాద్ : అప్పు ఇచ్చినవారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ ఎస్ఐ కోటేశ్వరరావు అజ్ఞాతంలో ఉన్నాడు. తన సర్వీస్ రివాల్వర్తోనే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రెండ్రోజులు క్రితం ఎస్ఐ తనను చిత్రహింసలకు గురి చేశాడని ఓ వ్యక్తి సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎస్ఐపై కేసు నమోదు చేయాలని సీపీ సందీప్ శాండిల్య ఆదేశించారు. అంతేకాకుండా ఎస్ఐని ఇప్పటికే సీపీ సస్పెండ్ చేశారు.
కాగా ఎస్ఐ కోటేశ్వరరావు వ్యవహా రాలపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. వాటిపై గతంలో పత్రికల్లో కథనాలు కూడా వచ్చినా.. కోటేశ్వరరావుకు డీసీపీ స్థాయిలోని అధికారి వెన్నుదన్నుగా ఉండటంతో విచారణ జరపకుండానే వదిలేశారు. తాజాగా సొంత పీఎస్లోనే ఎస్ఐపై కేసు నమోదైంది. దీంతో కోటేశ్వరరావు తన సెల్ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారయ్యాడు. అతడిపై ఐపీసీ 385, 342, 323, 506 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో ఎస్ఐతో పాటు నలుగురు సిబ్బందికి ప్రమేయమున్నట్లు తెలిసింది. కమిషనర్ ఆదేశాల మేరకు పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్రావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.