ఆ స్టేషన్ పేరువింటే నేరగాళ్లకు హడల్ | jubilee hills police station one of the best in solving cases among west zone | Sakshi
Sakshi News home page

ఆ స్టేషన్ పేరువింటే నేరగాళ్లకు హడల్

Apr 19 2016 6:23 PM | Updated on Sep 3 2017 10:16 PM

ఆ స్టేషన్ పేరువింటే నేరగాళ్లకు హడల్

ఆ స్టేషన్ పేరువింటే నేరగాళ్లకు హడల్

'ఎవరి పేరు చెబితే శత్రువుల గుండెల్లో గుబులు పుడుతుందో..'అనే సినిమా డైలాగ్ గుర్తుందికదా. సరిగ్గా అలాంటి గుబులే ఇప్పుడు నేరస్తులకు కలుగుతోంది ఓ పోలీస్ స్టేషన్ పేరు వింటే!

హైదరాబాద్: 'ఎవరి పేరు చెబితే శత్రువుల గుండెల్లో గుబులు పుడుతుందో..'అనే సినిమా డైలాగ్ గుర్తుందికదా. సరిగ్గా అలాంటి గుబులే ఇప్పుడు నేరస్తులకు కలుగుతోంది ఓ పోలీస్ స్టేషన్ పేరు వింటే! అది.. సినిమా తారలు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు ఎక్కువగా నివసించే ప్రాంతం. అంతకు మించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాక కూడా పోలీసులకు సవాళ్లు విసిరే పొగరుబోతులు తిరిగే చోటు, అప్పుడప్పుడూ రాత్రిపూట కార్లు రోడ్లను వీడి ఫుట్ పాత్ లపైకి వెళుంటాయక్కడ.

ఒక్క కేసు నమోదు చేయాలంటే వంద వైపుల నుంచి ఒత్తిళ్లు. ఒక్క నిందితుణ్ని లాకప్ లో పెట్టాలంటే లక్ష తలనొప్పులు! అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. నేరగాళ్లకు శిక్షలు పడేలా కేసులను త్వరితగతిన కేసులను పరిష్కరిస్తూ రికార్డు సాధించారు జూబ్లీ హిల్స్ పోలీసులు. ఆ స్టేషన్ పరిథిలో ఎలాంటి నేరానికి పాల్పడేవారైనా హడలెత్తుతున్నారు.

వెస్ట్ జోన్ పరిధిలోని 13 స్టేషన్లలో జూబ్లీ హిల్స్ పోలీసులు నమోదైన కేసుల పరిష్కారంలో అందరి కంటే ముందున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్(యూఐ) కేసుల మేళాలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. పెండింగ్ ఫైళ్లు, కేసుల పరిష్కారంలో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అండర్ ఇన్వెస్టిగేషన్ మేళా(యూఐ) నిర్వహించారు. వెస్ట్‌జోన్ పరిధిలోని 13 పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు ఈ మేళాలో పాల్గొని గత మూడు నెలల నుంచి తాము సాధించిన పురోగతిని వివరించారు. ఎన్ని ఫైళ్లను పరిష్కరించారో చూపించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ మేళాలో హైలెట్‌గా నిలిచారు.

నగర పోలీస్ కమిషనర్ ఇచ్చిన 227 కేసుల్లో జూబ్లీహిల్స్ పోలీసులు 218 కేసులను పరిష్కరించారు. జూబ్లీహిల్స్ పోలీసులు చేసిన కృషిని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు అభినందించారు. ఈ పోలీసులు 104.1 శాతం కేసులను పరిష్కరించినట్లయింది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 348 యూఐ కేసులుండగా 218 కేసులను పరిష్కరించడం అభినందనీయమని తెలిపారు. కేసుల పరిష్కారంలో ఇన్‌స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డితో పాటు ఎస్‌ఐలు డి.శ్రీను, గురుస్వామి, జగదీశ్, లోకారెడ్డి, రమేష్, డీఐ ముత్తు తదితరులు చేసిన కృషి ఫలితమిదని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement