ఆదాయపన్ను శాఖ 'ఐ' | Income Tax 'I' | Sakshi
Sakshi News home page

ఆదాయపన్ను శాఖ 'ఐ'

Jan 24 2016 3:02 AM | Updated on Sep 27 2018 4:02 PM

ఆదాయపన్ను శాఖ 'ఐ' - Sakshi

ఆదాయపన్ను శాఖ 'ఐ'

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థులు, ప్రభుత్వ విభాగాల వ్యవహారం ‘ఎవడి గోల వాడిది’ అన్నట్లు ఉంది.

ఎన్నికల అఫిడవిట్లపై ఆరా
♦ వీటిలోనే అభ్యర్థుల ఆస్తులు, కేసుల వివరాలు వెల్లడి
♦ వారి ‘నేరచరిత్ర’ను పరిశీలిస్తున్న పోలీసు విభాగాలు
♦ ఆదాయ, వ్యయాలపై ఐటీ శాఖ దృష్టి
 
 సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థులు, ప్రభుత్వ విభాగాల వ్యవహారం ‘ఎవడి గోల వాడిది’ అన్నట్లు ఉంది. సీట్ల కోసం పార్టీలు, ఓట్ల కోసం అభ్యర్థులు ‘అన్వేషిస్తుండగా’... పోలీసులు, ఆదాయపుపన్ను శాఖ అధికారులు ‘ఆధారాల’ కోసం అధ్యయనం చేస్తున్నారు. దీంతో ఈ విభాగాలు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల అఫిడవిట్లపై కన్నేశారు. ఏ మాత్రం ‘అవకాశం’ చిక్కినా నివేదికలు తయారు, తాఖీదులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

 అఫిడవిట్లలో అనేకాంశాలు...
 జీహెచ్‌ఎంసీ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణలు సైతం పూర్తి కావడంతో వీటికి తుదిరూపు కూడా వచ్చింది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయా అభ్యర్థులు అఫిడవిట్లనూ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో కుటుంబం, పిల్లలు వంటి వ్యక్తిగత వివరాలతో పాటు తమకు ఉన్న ఆస్తులు, తమపై ఉన్న కేసుల వివరాలనూ సమగ్రంగా పొందుపరుస్తారు. వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉండటంతో సాధారణంగా దాపరికాలకు దూరంగా ఉంటారు. ఇప్పుడు ఆయా విభాగాల కన్ను అభ్యర్థులు తమ నామినేషన్‌తో పాటు దాఖలు చేసి అఫిడవిట్లపై పడింది.

 కేసుల వివరాలపై పోలీసులు...
 ఈ నామినేషన్ అఫిడవిట్లలో అభ్యర్థులు అందించిన కేసు వివరాలను పోలీసు విభాగాలు సేకరిస్తున్నాయి. ఇప్పటికే రెండు కమిషనరేట్ల వద్దా గడిచిన కొన్నేళ్లుగా వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న, నిందితులుగా ఉన్న వారి చిట్టాలు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే వీటిని అప్‌డేట్ సైతం చేశారు. అఫిడవిట్లలోని అంశాలను ఈ డేటాబేస్‌లో సరిచూస్తున్నారు. దీని ఆధారంగా ఆయా అభ్యర్థులు ‘తమ కేసులకు’ సంబంధించిన పూర్తి వివరాలు, వాస్తవాలు సమర్పించారా? లేదా? అనేది సరిచూస్తున్నారు. ఈ వ్యవహారంలో ఏమాత్రం తేడా వచ్చినా అందుకు సంబంధించిన నివేదికలు తయారు చేసి ఎన్నికల సంఘానికి పంపడానికి అనువుగా ఈ వివరాలు లోతుగా ఆరా తీస్తున్నారు.

 ‘ఆదాయం’ కోసం ఐటీ శాఖ...
 కేంద్రం ఆధీనంలోని ఆదాయపు పన్ను, సేవా పన్ను శాఖలు అఫిడవిట్లలోని ఆస్తుల వివరాలపై దృష్టిపెడుతున్నారు. ఆయా అభ్యర్థుల్లో అనేక మంది నిత్యం ఐటీ, సర్వీస్ ట్యాక్స్ రిటర్న్స్ సైతం దాఖలు చేస్తుంటారు. అయితే ‘పన్నుపోటు’ నుంచి తప్పించుకోవడానికి కొందరు వాస్తవాలను దాస్తారనేది ఆదాయపు పన్ను, సేవా పన్ను శాఖల అనుమానం. ఈ రిటర్న్స్ అనేవి రహస్య సమాచారం కావడంతో అందరికీ తెలిసే అవకాశం ఉండదని అభ్యర్థులు ‘గోప్యత’ పాటించినా... అఫిడవిట్ల విషయంలో అలా కుదరదు. ఇవి అందరికీ ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ, పోటీదారులకు అందుబాటులో ఉండేవి. వీటిలో ఏమాత్రం తేడా ప్రస్తావనలు చేసినా... వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇందులో అభ్యర్థులు సరైన వివరాలు అందిస్తారనేది ఆయా శాఖల అభిప్రాయం.

 తేడా కనిపిస్తే తాఖీదులే...
 దీంతో ఐటీ, ఎస్‌టీ శాఖలు అఫిడవిట్లను అధ్యయనం చేయడం ద్వారా తమ దృష్టికి రాని ఆస్తుల్ని గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తొలుత వీటిని గుర్తిస్తే వాటిని ఏరకంగా వినియోగిస్తున్నారు? తద్వారా ఎలాంటి ఆదాయం వస్తోంది? ఎప్పటి నుంచి ఈ వ్యవహారం కొనసాగుతోంది? అనే అంశాలను రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా సేకరించే వీలుంటుంది. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరించి సమగ్ర నివేదికలు తయారు చేయనున్నారు. వీటిని ఐటీ రిటర్న్స్‌లో సరిచూసి ‘తేడాగాళ్ల’కు పన్ను బకాయిలు చెల్లించమంటూ తాఖీదులు జారీ చేయాలన్నది ఈ రెండు శాఖల ప్రధాన ఉద్దేశం. ఎన్నికల్లో గెలిచిన, ఓడిన వారిలో ఈ తరహాకు చెందిన వారుంటే..ఈ అంశం వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేదిగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement