
ఫ్యామిలి పాక్
రిజర్వేషన్ల కారణంగా గ్రేటర్ పోరు ఉత్కంఠ భరితమైంది. ఊహకందని, అనుభవం లేని, వారసత్వమే పునాదిగా రాజకీయ అరంగేట్రం చేసిన కొత్త ముఖాలు బరిలో నిలుస్తున్నాయి.
రిజర్వేషన్ల కారణంగా గ్రేటర్ పోరు ఉత్కంఠ భరితమైంది. ఊహకందని, అనుభవం లేని, వారసత్వమే పునాదిగా రాజకీయ అరంగేట్రం చేసిన కొత్త ముఖాలు బరిలో నిలుస్తున్నాయి. అత్యధిక డివిజన్లలో ముఖ్యనేతల బంధుగణమే పోటీలో నిలిచింది. మొదటి నుంచి అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న నేతలు.. రిజర్వేషన్లు మారడంతో వారి వారసులను పోటీలో నిలుపుతున్నారు. భార్య, సోదరి, మరదలు, అత్త, కోడలు..ఇలా ఎవరికి అవకాశం ఉంటే..వారిని రంగంలోకి దింపుతున్నారు. కాస్త ప్రాముఖ్యం ఉన్న నేత..ఈ పదవి తనకు చిన్నదిలే అనుకుంటే..సోదరులను ప్రోత్సహిస్తున్నారు. అంతేకానీ..పార్టీలో ముందు నుంచి అంకితభావంతో పనిచేస్తున్న కింది స్థాయి నేతలను, కార్యకర్తలను ప్రోత్సహిస్తున్న దాఖలాలు ఏ పార్టీలోనూ కన్పించకపోవడం గమనార్హం!
- సాక్షి, సిటీబ్యూరో
* బరిలో బంధుగణం!
* గ్రేటర్ ఎన్నికల్లో ‘వారసుల’ హల్చల్
* అన్ని పార్టీల్లోనూ ఇదే వరుస
* భారీగా నామినేషన్లు వేసిన ముఖ్యనేతలు,
* మాజీ ప్రజాప్రతినిధుల బంధువులు
* కింది స్థాయి నేతలు, కార్యకర్తలకు నిరాశే
ఎవరెన్ని చెప్పినా.. ముందు తమ ప్రయోజనాల తర్వాతే ఇతరుల ప్రయోజనాలు. ఎంత నిస్వార్థసేవ చేస్తున్నామని చెప్పేనాయకులైనా ఆచరణకొచ్చేటప్పటికి, అన్నీ వదిలేస్తారు. ‘ఎక్కడైనా బావ కానీ వంగతోట కాడ కాదు’అన్నట్లుగా.. రాజకీయాల్లో పదవులకు అవకాశం ఉన్నచోట మాత్రం మన కుటుంబమే ఉండాలి.. అన్నట్లుంది నేటి నేతల వైఖరి. ఇందులో ఏపార్టీకీ, ఏ నాయకునికీ మినహాయింపులేదు. కార్పొరేటర్ గిరీపై ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న నాయకులు...అవి మహిళల రిజర్వేషన్లోకి వెళ్లడంతో బంధుగణాన్ని రంగంలోకి దింపారే తప్ప..‘మనకు అవకాశం లేదు.. పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న మహిళలకు ఇప్పిద్దాం’ అని మాత్రం అనుకోలేదు.
వాళ్లు కాకపోతే వారి సతీమణి.. లేదా కుమార్తెలు.. అదీ కుదరకపోతే మరదళ్లు. ఇది తాజా మాజీ కార్పొరేటర్లే కాక ఆయా పార్టీల్లో కీలక పద వుల్లో ఉన్న నేతలు , మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు.. ఇతరత్రా ప్రాధాన్యత పోస్టుల్లో వెలుగు వెలిగిన వారి వైఖరి. తమ స్థాయికి ఇది తక్కువ అనుకుంటున్న మరికొందరు తమ కొడుకులను, అల్లుళ్లను, సోదరులను బరిలోకి దించుతున్నారు. అలా తమ పరపతితో తమ వారుసులను అరంగేట్రం చేయిస్తున్నవారు గ్రేటర్ బరిలో చాలా మందే ఉన్నారు..
అధికార పార్టీలోనే ఎక్కువ...
అధికార పార్టీ టీఆర్ఎస్లో ముఖ్యనేత , ఎంపీ కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్నుంచి బరిలో దిగారు. హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్రెడ్డి రామ్నగర్ డివిజన్నుంచి ఎంతో కాలంగా ప్రచారంలో ఉండటమే కాక అనుకున్నది సాధించారు. మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డి ఆర్కేపురం డివిజన్నుంచి పోటీచేస్తున్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి అల్వాల్ డివిజన్నుంచి పోటీ చేస్తున్నారు. దివంగత కాంగ్రెస్ నాయకుడు పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ డివిజన్నుంచి రంగంలో దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసిన మన్నె గోవర్ధన్రెడ్డి భార్య వెంకటేశ్వరకాలనీ నుంచి పోటీ చేస్తున్నారు. ఉప్పల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన బేతి సుభాష్రెడ్డి భార్య స్వప్న హబ్సిగూడ డివిజన్ అభ్యర్థిగా ఉన్నారు. ముషీరాబాద్ డివిజన్నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీచేసిన ముఠాగోపాల్ మరదలు ముఠా పద్మ గాంధీనగర్ డివిజన్నుంచి రంగంలో ఉన్నారు.
ఈమె గత పాలకమండలిలోనూ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన, గత పాలకమండలిలో కాంగ్రెస్ ఫ్లోర్లీడర్గా వ్యవహరించిన కాలేరు వెంకటేశ్ భార్య కాలేరు జయశ్రీ గోల్నాక డివిజన్ అభ్యర్థిగా ఉన్నారు. గత పాలకమండలిలో టీడీపీ ఫ్లోర్లీడర్గా వ్యవహరించిన సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి సైదాబాద్ డివిజన్నుంచి పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీకి సంబంధించి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కుమార్తె స్వప్న అత్తాపూర్ డివిజన్నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్లో మాజీ మంత్రి ముఖేశ్గౌడ్ కుమారుడు విక్రంగౌడ్ జాంబాగ్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ భార్య పద్మ జీడిమెట్ల డివిజన్ నుంచి రంగంలో ఉన్నారు. బీజేపీ నగర అధ్యక్షుడు వెంకటరెడ్డి భార్య పద్మా వెంకటరెడ్డి బాగ్అంబర్పేట నుంచి పోటీ చేస్తున్నారు.
ఎంఐఎం నుంచి సైతం...
ఉప్పుగూడ మాజీ కార్పొరేటర్ సమద్ బిన్ అబ్దాద్ కుమారుడు ఫహద్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దాద్ శనివారం ఎంఐఎం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయా కుటుంబాల వారసులుగా బరిలో మరికొందరూ ఉన్నారు.