ప్రజల ముద్ర లేని బడ్జెట్‌: ఈటల | etla rajender about budget | Sakshi
Sakshi News home page

ప్రజల ముద్ర లేని బడ్జెట్‌: ఈటల

Feb 2 2018 2:53 AM | Updated on Feb 2 2018 4:20 AM

etla rajender about budget - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రజల ముద్ర లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్‌లో తెలంగాణకు నిధులేమీ ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయ, భగీరథకు దాదాపు రూ.40 వేల కోట్లివ్వాలని తాము అడిగామని, కానీ ఇచ్చిందేమీ లేదన్నారు.

దేశంలో తెలంగాణ అంతర్భాగమే కదా అని ప్రశ్నించారు. ప్రగతిశీల నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్న రాష్ట్రాలకు సాయం అందించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం, వైద్యం, విద్యపై కేంద్రం దృష్టి పెట్టినట్లు కనపించినా, ప్రజల హృదయాల్లో ముద్ర వేయలేకపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు బడ్జెట్‌ ఊతమిచ్చేలా ఉన్నప్పటికీ నిధుల కేటాయింపులో నిబద్ధత పాటించి ఉంటే బాగుండేదన్నారు. ఆరోగ్య బీమా పథకానికి అరకొర నిధులు కాకుండా సంపూర్ణంగా కేటాయింపులుండాలని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement