మధ్యతరగతిపై పెనుభారం | electrical charges of Rs 800 crore burden on middle class | Sakshi
Sakshi News home page

మధ్యతరగతిపై పెనుభారం

Apr 1 2017 1:54 AM | Updated on Sep 5 2018 3:44 PM

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచింది. మధ్యతరగతిపై రూ.800 కోట్ల అదనపు భారం మోపింది.

రూ.800 కోట్ల విద్యుత్‌ చార్జీల వడ్డన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచింది. మధ్యతరగతిపై  రూ.800 కోట్ల అదనపు భారం మోపింది. కొత్తగా పెరిగిన చార్జీలు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ చార్జీలు పెరగడం ఇది మూడోసారి. ఈ మూడేళ్లలో సుమారు రూ.2 వేల కోట్లు ప్రత్యక్షంగా వడ్డించారు. మరో 3 వేల కోట్ల మేరకు ప్రజలపై దొడ్డిదారిన భారం మోపారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) శుక్రవారం హైదరాబాద్‌లో  2017–18 సంవత్సరానికి కొత్త టారిఫ్‌ను ప్రకటించింది. ఈ ఆర్డర్‌ వారం  క్రితమే తయారైంది. శాసనసభలో విపక్షం చార్జీల పెంపుపై తప్పకుండా నిలదీస్తుందనే ఉద్దేశంతో శుక్రవారం సభ వాయిదా పడిన వెంటనే పెంపు నిర్ణయాన్ని ప్రకటించారు.

2017–18లో రూ.8,065 కోట్ల ఆర్థిక లోటును విద్యుత్‌ పంపిణీ సంస్థలు సూచించాయి. ఈ మొత్తంలో రూ.1,111 కోట్లు ప్రజల నుంచి చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని, రూ.6,954 కోట్లు సబ్సిడీగా ఇవ్వాలని ప్రతిపాదించాయి. ప్రభుత్వం సబ్సిడీగా కేవలం రూ.3,700 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. డిస్కమ్‌లు ప్రతిపాదించిన మొత్తంలో ఏపీఈఆర్‌సీ కొంత కోత విధించింది. ప్రత్యక్షంగా చార్జీల రూపంలో 800 కోట్ల మేర రాబట్టుకునేందుకే అనుమతించింది.పరిశ్రమలు, వాణిజ్యవర్గాలపై పెరిగే విద్యుత్‌ చార్జీల భారం..పరోక్షంగా సర్వీస్‌ చార్జీల రూపంలో పేద, మధ్యతరగతి వర్గాలపై అదనంగా పడనుంది. గృహ విద్యుత్‌ వినియోగం నెలకు 225 యూనిట్లు దాటితే బిల్లు మోత మోగుతుంది.

ప్రజాగ్రహం తప్పదు: వైఎస్సార్‌సీపీ
 విద్యుత్‌ చార్జీలు పెంచాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వైఎస్సార్‌ సీపీ హెచ్చరించింది. బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన కొన్ని గంటల్లోనే   దొంగదెబ్బ తీసిందని విమర్శించింది.

Advertisement
 
Advertisement
Advertisement