
నిధులు ఫుల్... పనులు నిల్
ఎక్కడైనా అభివృద్ధి పనులు చేపట్టాలంటే సాధారణంగా నిధులు లేవనే మాట వినిపిస్తుంది. జీహెచ్ఎంసీలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం.
మంజూరైనది రూ.9 వేల కోట్లు ..
ఖర్చు చేసింది రూ. 2,168 కోట్లు
ఇదీ గత పాలకమండలి తీరు
అభివృద్ధిపై శ్రద్ధ చూపని కార్పొరేటర్లు
సిటీబ్యూరో: ఎక్కడైనా అభివృద్ధి పనులు చేపట్టాలంటే సాధారణంగా నిధులు లేవనే మాట వినిపిస్తుంది. జీహెచ్ఎంసీలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. ఇక్కడ కావలసినన్ని నిధులిచ్చినప్పటికీ ఖర్చు చేయలేకపోయారు మన మాజీ కార్పొరేటర్లు. గత పాలక మండలి హయాంలో ఐదేళ్ల కాలంలో మొత్తం రూ.9 వేల కోట్లు మంజూరైతే... మనవాళ్లు కేవలం రూ.2,168 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. మిగతా నిధులు మురిగిపోయా యి. సంబంధిత డివిజన్లలో ఏళ్ల తరబడిసమస్యలు అలాగేఉన్నా యి. వచ్చిన నిధులన్నింటినీ సక్రమంగా ఖర్చు చేస్తే స్థానికులకు ఎంతో ఊరట కలిగేది. ఇక నాణానికి రెండోవైపు చూస్తే ...డివిజన్లలో జనాభా 30 వేలు ఉన్నా ... 90 వేలు ఉన్నా... నిధులు మా త్రం సమానంగా మంజూరు చేశారు. దీంతో ఎక్కువ జనాభా ఉన్న డివిజన్లలో తగిన స్థాయిలో అభివృద్ధికి ఆస్కారం లేకుండాపోయింది.
అంతరాలు ఇలా.. గత పాలక మండలి 2009-10 నుంచి 2014-15 వరకు కొనసాగింది. కంచన్బాగ్ డివి జన్కు 2010-11లో దాదా పు రూ.2 కోట్లు మంజూరు కాగా... ఖర్చు చేసింది మాత్రం రూ.90 లక్షలే. చందానగర్ డివిజన్కు 12.50 కోట్లు రాగా... ఖర్చు చేసింది రూ.9.90 లక్షలు. ఇలా ఐదేళ్లలో 150 డివి జన్లకు మొత్తం దాదాపు రూ.9000 కోట్లు మంజూరు కాగా... ఖర్చు చేసింది కేవలం రూ.2,168 కోట్లు మాత్రమే. కనీసం 25 శాతం కూడా వెచ్చించలేకపోయారు. గతంలో అధికారంలో ఉన్న కార్పొరేటర్లు విహార యాత్రలు, ల్యాప్టాప్లు, హ్యాండీకామ్ల వంటి తమకు కావాల్సిన వాటి పై చూపిన శ్రద్ధలో ఒకటో వంతు కూడా అభివృద్ధి పనులు... ప్రజా సమస్యల పరిష్కారంపై చూపలేకపోయారు. మరోవైపు ఐదేళ్లలో 92వేల మందికి పైగా ఓటర్లు ఉన్న మోతీనగర్ డివిజన్లో నూ... 30 వేల ఓటర్లు మాత్రమే ఉన్న రామంతాపూర్ డివిజన్లో నూ ఒకేలా రూ.22 కోట్ల వంతున ఖర్చు చేశారు. దీంతో అభివృద్ధి... సౌకర్యాల కల్పనలో డివిజన్ల మధ్య అసమానతలు పెరిగాయి.
అయినా తీరు మారలేదు
ఈ వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకుని డివిజన్ల మధ్య జనాభా దాదాపు సమానంగా ఉండే లా డీలిమిటేషన్ చేయాలని కోరు తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు డివిజన్ల మధ్య సమాన జనాభా ఉండేలా పునర్విభజన చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దాన్ని పూర్తి చేసేం దుకే ఎన్నికల నిర్వహణకు ఏడాది జాప్యమైంది. అయినా పరిస్థితిలో మార్పులేదు. తాజా జనాభా/ ఓటర్లను పరిగణనలోకి తీసుకోకుండా 2011 జనాభాను లెక్కలోకితీసుకొని డీలిమిటేషన్ చేశారు. ఇప్పుడు కూడా ఒక డివిజన్లో 30 వేల ఓటర్లు ఉంటే... మరో డివిజన్లో 70వేలకు పైగా ఉన్నారు. ఎన్నికలు జాప్యం చేసి, ఎంతో కసరత్తు చేసి డీలిమిటేషన్ చేసినా ఆశించిన ప్రయోజనం నెరవే రలేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్లో తిరిగి అసమానతలు తలెత్తకుండా ఉండాలంటే డివిజన్లోని జనాభాకు అనుగుణంగా ఒక్కో వ్యక్తికి రూ.2 వేల చొప్పున అంచనా వేసి బడ్జెట్లో నిధులు కేటాయించాలని లోక్సత్తా శుక్రవారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేసింది. ఈ అంతరాలను సరిదిద్దాలని పార్టీ నేతలు బి.సాంబిరెడ్డి, జగన్,భవాని, లావ ణ్య డిమాండ్ చేశారు. దీనిపై కొత్తగా అధికారంలోకి వచ్చేవారు ఏం చేస్తారో చూడాలి.
అభివృద్ధిపై సమగ్ర విధానం అవసరం
నగర అభివృద్ధిపై సమగ్ర విధానం లేకపోవడం వల్ల నిధుల ఖర్చు విచ్చలవిడిగా సాగుతోంది. బడ్జెట్కూ ఖర్చుకూ పొంతన లేకుండా పోతోంది. జనాభా ప్రాతిపదికన అభివృద్ధికి నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. అన్ని డివిజన్లకు సమానంగా నిధులివ్వడం సరికాదు. దీని వల్ల అభివృద్ధి చెందిన ప్రాంతాలకు కేటాయించిన నిధులు దుర్వినియోగమవుతున్నాయి. కార్పొరేటర్లకు కేటాయిస్తున్న నిధులను ప్రాధాన్యం గలపనులకు ఖర్చు చేయటం లేదు. అధికారులు, సిబ్బంది కొరత కూడా అభివృద్ధిలో వెనుకబాటుకు కారణం. ఇప్పటికై నా నగర అభివృద్ధికి సమగ్ర విధానాన్ని రూపొందించాలి.
- ఎం.శ్రీనివాస్, సీపీఎం నగర నేత
నిధుల ఖర్చే తక్కువ... ఆపై గోల్మాల్
బడ్టెట్ అంచనాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయలేకపోతున్నారు. పోనీ ఆ కాస్త నిధులైనా అభివృద్ధి కోసం వెచ్చించారా అంటే అదీ లేదు. అందులోనూ అవినీతే ఎక్కువ. సిబ్బంది తక్కువ కావడంతో అభివృద్ధి పనులపై తనిఖీలు నిర్వహించడం లేదు. వెనుకబడిన ప్రాంతాలు, మురికివాడల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలి. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందాలంటే సమగ్రమైన విధానాన్ని రూపొందించి... తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
- డాక్టర్ సుధాకర్, సీపీఐ నగర నేత