అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీద్దాం | CLP meeting on 15, 16 | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీద్దాం

Dec 13 2016 2:00 AM | Updated on Mar 18 2019 9:02 PM

అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీద్దాం - Sakshi

అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీద్దాం

బడ్జెట్‌ సమావేశాల తర్వాత జరుగుతున్న శాసనసభా సమావే శాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అంశాలవారీగా ఎండగట్టడానికి కాంగ్రెస్‌ సన్నద్ధమవుతోంది.

- శాసనసభ సమావేశాలకు కాంగ్రెస్‌ సన్నద్ధం  
- శాఖలవారీగా సీనియర్లకు బాధ్యతల అప్పగింత
- 15, 16వ తేదీల్లో సీఎల్పీ భేటీ  

సాక్షి, హైదరాబాద్‌: బడ్జెట్‌ సమావేశాల తర్వాత జరుగుతున్న శాసనసభా సమావే శాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అంశాలవారీగా ఎండగట్టడానికి కాంగ్రెస్‌ సన్నద్ధమవుతోంది. ప్రధాన సమస్యలపై టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను, ఎన్నికల హామీలపై నిర్లక్ష్యాన్ని శాసనసభ వేదికగా నిర్మాణాత్మకంగానే నిలదీయడానికి పార్టీ ఎమ్మెల్యేలను సిద్ధం చేస్తున్నది. కరువు, రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటివాటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాలపై ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీ దృష్టిని కేంద్రీకరించింది. రుణమాఫీ హామీని అమలు చేయకుండా, రైతుల ఆత్మహత్యలకు కారణమైన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతుల విషయంలోనూ, వారికి నష్టపరిహారం విషయంలో మోసపూరిత వైఖరిని చట్టసభలోనే నిలదీయడానికి అవసరమైన నిర్ధిష్ట సమాచారాన్ని సిద్ధం చేసుకుంది.

ప్రాజెక్టుల రీడిజైన్, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు, టెండర్లలో అవినీతి వంటివాటిపైనా అధ్యయనం చేస్తోంది. భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా అవసరమైన సమాచారాన్ని సేకరించింది. వీటితో పాటు ఫీజు రీయింబర్సుమెంటుపైనా ఇప్పటిదాకా కాంగ్రెస్‌ చేసిన దరఖాస్తుల ఉద్యమం సందర్భంగా వచ్చిన సమాచారం, ఎదురైన సంఘటనలను క్రోడీకరించుకుంటున్నది.

డబుల్‌ బెడ్‌రూమ్‌పై నిలదీతకు రంగం
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోసం 150 కోట్లతో 9 ఎకరాల్లో భారీ భవంతిని నిర్మించుకోవడంపై నిలదీయడానికి సిద్ధమైంది. వీటితో పాటు ముస్లింలకు, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు, కేజీ టు పీజీదాకా ఉచిత నిర్బంధ విద్య, దళితులకు మూడెకరాల భూమి, విద్యారంగ సమస్యలు, పార్టీ ఫిరాయింపులు వంటి అంశాలపైనా సీనియర్లు సమాచారాన్ని సేకరిస్తున్నారు. పార్టీ సీనియర్‌ శాసనసభ్యులు, మాజీమంత్రి టి.జీవన్‌ రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలకు శాఖలవారీగా బాధ్యతలను అప్పగించారు. వ్యవసాయశాఖపై జి. చిన్నారెడ్డి, జీవన్‌ రెడ్డి అధ్యయనం చేస్తున్నారు.

నీటిపారుదల శాఖపై డి.కె.అరుణ, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఫిరాయింపులపై సంపత్‌కుమార్‌ తదితరులు అధ్యయనం చేస్తున్నారు. కె.జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు అన్ని అంశాలపైనా స్థూలమైన అధ్యయనం చేస్తున్నారు. వీరితోపాటు ఎమ్మెల్యేలందరికీ వివిధ శాఖల సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశం కానుంది. పార్టీ సీనియర్లు ఇప్పటిదాకా చేసిన అధ్యయనం, శాఖలవారీగా నిపుణులతో చర్చించిన అంశాలు, ఇంకా దృష్టిని కేంద్రీకరించాల్సిన సమస్యలు, టీఆర్‌ఎస్‌కు అడ్డుకట్ట వేయడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని రెండురోజుల పాటు జరిగే సీఎల్పీ సమావేశాల్లో చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement