బాబూ ప్రజల నుంచి ర్యాంకు తెచ్చుకో..! | Battula brahmananda reddy comments on chandrababu | Sakshi
Sakshi News home page

బాబూ ప్రజల నుంచి ర్యాంకు తెచ్చుకో..!

Nov 3 2016 1:55 AM | Updated on Aug 10 2018 8:23 PM

బాబూ ప్రజల నుంచి ర్యాంకు తెచ్చుకో..! - Sakshi

బాబూ ప్రజల నుంచి ర్యాంకు తెచ్చుకో..!

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు.

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలోనే మేటి రాజధాని నిర్మిస్తున్నానని, తన పాలన నంబర్ వన్‌గా ఉందని చంద్రబాబు ప్రచారం చేసుకోవటంపై బత్తుల మండిపడ్డారు. ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టినందుకు సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఏపీకి ఫస్ట్ ర్యాంకు వచ్చిందా అని ప్రశ్నించారు. దేశం మొత్తం మీద సర్వే చూస్తే 91.4 శాతంతో బాబు పాలనంతా అవినీతి, దోపిడీ జరుగుతోందని ఎన్‌సీఈఏఆర్ సర్వేలో తేలిందని, 74.3 శాతం పారిశ్రామికవేత్తలు ఇదే అంటున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ, బీసీ, మైనార్టీలు, మేధావుల నుంచి చంద్రబాబు ర్యాంకు పొందాలని బత్తుల హితవు పలికారు. చంద్రబాబు చేపట్టిన నవ నిర్మాణ దీక్షలను నయవంచన దీక్షగా బత్తుల అభివర్ణించారు.

 ఆ అర్హత నీకెక్కడిది..?
 చంద్రబాబు తన చేతకానితనాన్ని ప్రతిపక్షాల మీదకి నెట్టేసే పరిస్థితికి వచ్చారని బత్తుల మండిపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత బాబుకు లేదన్నారు. రైల్వే కాంట్రాక్టర్‌ను బెదిరించిన టీడీపీ వెంకటగిరి ఎమ్మెల్యే అవినీతిపై కేసు ఉండదనీ, ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకు తమ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధనరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలపై అక్రమంగా క్రిమినల్ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఈ నెల 6న విశాఖలో జరిగే ‘జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో తమ అధ్యక్షుడు వైఎస్ జగన్.. చంద్రబాబు చేతకానితనాన్ని, అసమర్థతను ఎండకడుతూ ప్రత్యేక హోదా పట్ల ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement