బ్యాంకులకు ‘శని’వారం! | Bank Robbery for Target Saturday? | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు ‘శని’వారం!

Feb 16 2016 1:26 AM | Updated on Aug 30 2018 5:27 PM

బ్యాంకులకు ‘శని’వారం! - Sakshi

బ్యాంకులకు ‘శని’వారం!

సోమవారం వచ్చిందంటే చాలు... ఏ ప్రాంతంలో ఏ బ్యాంకు దొంగతనం.. చోరీ యత్నం వ్యవహారాలు వెలుగులోకి వస్తాయో?

* ఆ రోజునే ఎంచుకుంటున్న చోరులు             
* మర్నాడు సెలవుతో తేలిగ్గా సేఫ్‌జోన్‌లోకి...
* తాజాగా ఘట్‌కేసర్ ఆంధ్రా బ్యాంకులో చోరీ  
* అధికారులను అప్రమత్తం  చేయాలని నిర్ణయం


సాక్షి, సిటీబ్యూరో: సోమవారం వచ్చిందంటే చాలు... ఏ ప్రాంతంలో ఏ బ్యాంకు దొంగతనం.. చోరీ యత్నం వ్యవహారాలు వెలుగులోకి వస్తాయో? అని ఆలోచించాల్సిన పరిస్థితి పోలీసు విభాగంలో నెలకొంది. బ్యాంకుల్లో ఉన్న లోపాలకు తోడు దొంగలు అనుసరిస్తున్న పంథానే దీనికి కారణం. తీరిగ్గా తమ పని పూర్తి చేసుకోవడంతో పాటు విషయం బయటకు పొక్కేలోపే సురక్షిత  ప్రాంతానికి చేరుకోవడానికి భారీ చోరులు ‘టార్గెట్ శనివారం’ సూత్రాన్ని అమలు చేస్తున్నారు.

దీనిపై దృష్టి పెట్టిన పోలీసు విభాగం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. తాజాగా ఘట్‌కేసర్‌లోని ఆంధ్రా బ్యాంక్‌లో చోరీ వ్యవహారం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇదే కాకుండా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో చోరీ యత్నాలు కూడా శనివారమే జరిగి... సోమవారం వెలుగులోకి వచ్చాయి. పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్‌లకు చెందిన అనేక ముఠాలు బ్యాంకులు, భారీ ఫైనాన్స్ సంస్థలనే టార్గెట్‌గా చేసుకుని పంజా విసురుతున్నాయని ఇప్పటికే నిర్థారణైంది.

చోరీకి గురైన సంస్థలు, బ్యాంకులు హైవేకి సమీపంలో లేదా 10-15 కి.మీ. దూరంలోనే ఉంటున్నాయి. గ్యాస్ కట్టర్లు, ఇతర ఉపకరణాలతో సహా రంగంలోకి దిగే ఈ ముఠాలు ముందుగానే ఆ ప్రాంతాలో మకాం వేసి టార్గెట్ చేసిన బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల దగ్గర పక్కాగా రెక్కీ చేస్తున్నాయి. అదును చూసి ఓ శనివారం పంజా విసురుతున్నాయి. ఘటనాస్థలిలో ఎలాంటి ఆధారం చిక్కకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం, వేలిముద్రలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, పోలీసు జాగిలాలు వాసన ద్వారా తాము వెళ్లిన మార్గాన్ని గుర్తించకుండా ఉండేలా కారం పొడి చల్లడం వంటివీ చేస్తున్నాయి.
 
వెలుగు చూసేసరికే ‘సేఫ్’...
బ్యాంకు, ఫైనాన్స్ సంస్థల్లో చోరీ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే దొంగలు షెల్టర్ తీసుకునే అవకాశం ఉన్న ప్రాంతాలతో పాటు వారు ప్రయాణించే మార్గాల్లోనూ పోలీసులు నిఘా వేయడం.. సోదాలు, తనిఖీలు చేయడం ద్వారా వారిని పట్టుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం చోరీ సమాచారం సాధ్యమైనంత త్వరగా పోలీసులకు చేరాలి. కానీ శనివారం చోరీ చేస్తే మరుసటి రోజు సెలవు కావడంతో బ్యాంకు సిబ్బంది సహా ఎవరూ దొంగతనం విషయాన్ని గుర్తించే అవకాశం ఉండదు.

సోమవారం ఉద యం వరకు ఈ విషయం వెలుగులోకి రాదు. ఇలా తమ చేతిలో ఉంటున్న 24 గంటలకు పైగా కాలాన్ని వినియోగించుకుంటున్న పొరుగు రాష్ట్రా ల ముఠాలు సురక్షితంగా తమ ప్రాంతాలకు చేరిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏకంగా తమ సొంత స్థలాలకు కూడా వెళ్లిపోతున్నాయి. ఫలితంగా దర్యాప్తు, నిందితుల అరెస్టులు కష్టసాధ్యం కావడంతో పాటు రికవరీల శాతాలు దారుణంగా పడిపోతున్నాయి.

‘టార్గెట్ శనివారం’ కారణంగానే రెండేళ్ల క్రితం మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో చోరీ కేసులో పూర్తిస్థాయిలో సొత్తు రికవరీ కాలేదు. బాలానగర్ ఎస్బీఐలో జరిగిన కేసు కొలిక్కి కూడా చేరలేదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసు విభాగం బ్యాంకులను అప్రమత్తం చేయాలని భావి స్తోంది. సున్నితమైన ప్రాంతాల్లో ఉండే బ్యాం కుల్లో నగదుతో పాటు సొత్తు సైతం ఎక్కువ ఉండకుండా చూడాలని... సెలవు రోజుల్లో ఉదయం, సాయంత్రం ఓ బాధ్యతగల ఉద్యోగి వచ్చి బ్యాంకును పరిశీ లించి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరనుంది.
 
ఇదీ శనివారం నేరాల వరుస..
2014 జనవరిలో మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరీ.
అదే ఏడాది ఆగస్టులో మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని గ్రామీణ వికాస్‌బ్యాంక్‌ను దొంగలు కొల్లగొట్టారు.
అదే ఏడాది నవంబర్‌లో చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాళెంలో సప్తగిరి గ్రామీణ బ్యాంకును దోచేశారు.
అదే రోజున వరంగల్ జిల్లా భూపాలపల్లి, ఆజాంనగర్ ఏపీజీవీబీ బ్యాంకుల్లోనూ దొంగతనాలు జరిగాయి.
గత ఏడాది జనవరిలో ఇబ్రహీంపట్నంలో ఉన్న సహకార కేంద్ర బ్యాంకు, మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్‌లో ఉన్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో చోరీ యత్నం.
2015 డిసెంబర్‌లో దిల్‌సుఖ్‌నగర్‌లోని ఎస్బీహెచ్ బ్యాంక్ శాలివాహన నగర్ బ్రాంచ్‌లో చోరీకి యత్నం.

Advertisement
 
Advertisement
Advertisement