పర్యవేక్షణ లోపమే ‘ఇంటర్‌’ వైఫల్యం

IYR Krishna Rao Article On Telangana Inter Results - Sakshi

విశ్లేషణ

పరీక్షా ఫలితాల వెల్లడి కోసం ప్రైవేట్‌ సంస్థను ఎంచుకోవడంలో అన్ని విధివిధానాలూ పాటించి ఉన్నా, ఆచరణలో సంస్థ కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత, దానికి తగిన సామర్థ్యం తమదగ్గర లేనప్పుడు అటువంటి సామర్థ్యం ఉన్న ప్రభుత్వ సంస్థ సహాయ సహకారాలు తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఇంటర్‌ బోర్డుపై ఉన్నాయి. ఈ బాధ్యతలను తెలంగాణ ఇంటర్‌ బోర్డు సక్రమంగా నిర్వహించలేదన్నది నిజం. ఎలక్ట్రానిక్‌ రూపంలో వచ్చిన ఫలితాలను భౌతికంగా ఒక పది శాతం దాకా అయినా సరిచూసుకోవటం, ఇలాంటి కార్యక్రమాల్లో తీసుకోవలసిన కనీస జాగ్రత్త చర్యలు.. అటువంటి నిర్ధారణ చేసి ఉంటే పరీక్ష ఫలితాలు ప్రకటించడానికి ముందే ఈ లోపాలన్నీ ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారుల దృష్టికి వచ్చి ఉండేవి. అలాంటి పర్యవేక్షణ, నిర్ధారణ లోపమే పరీక్షా ఫలితాల వెల్లడిలో ఇంటర్‌ బోర్డు వైఫల్యానికి కారణం.

భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా చాలా ప్రధానమైనటువంటి ఘట్టం ఇంటర్మీడియట్‌ విద్య. విద్యార్థులు భవిష్యత్తులో ఏ వృత్తిలో ఉండాలనేది ఇప్పుడే నిర్ణయమవుతుంది. ఉన్నత విద్యాస్థాయిలో ఒక విద్యా విభాగం నుంచి మరొక విభాగానికి మారే అవకాశం లేని మన విద్యా విధానంలో ఇంటర్మీడియట్‌లో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి విద్యార్థుల భవిష్యత్‌ విద్యే కాక వారి వృత్తిపరమైన నిర్ణయం కూడా జరుగుతుంది. తీసుకున్న సబ్జెక్టులను బట్టి భవిష్యత్తులో వారు డాక్టర్లయ్యేది, ఇంజనీర్లయ్యేది, ఇంకేదైనా వృత్తిలో స్థిరపడేది ఈ సమయంలోనే నిర్ణయమవుతుంది. అందుకనే తల్లిదండ్రులు కూడా విద్యార్థుల చదువులలో ఈ ఘట్టానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. పిల్లలతోపాటు తామూ శ్రమపడి వారు చక్కని ఫలితాలు సాధించడానికి తోడ్పడుతుంటారు. ఒకరకంగా మొత్తం కుటుంబం కలిసి తీసుకునే పరీక్ష ఇంటర్మీడియట్‌ పరీక్ష. ఇంత ప్రాధాన్యం కలిగిన ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వాలు సక్రమంగా నిర్వహించకపోవడం కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు పరీక్ష పత్రాల లీకేజీ, జంబ్లింగ్‌ విధానాల్లో లోపాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశాయి. ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు ముందే అనుకున్న వ్యూహం ప్రకారంగా రాజీనామాలు చేయడానికి సమాయత్తపడటం సీఎంలు నివారించటం సాధారణంగా పరిపాటి అయిపోయింది. కానీ నేడు తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ చేసిన స్థాయిలో ఫలితాలను పూర్తిగా అస్తవ్యస్తంగా ఎవరూ చేయలేదు.

ఇలాగే 1997లో ఒకసారి ఇంటర్‌ ఫలితాలు వెలువరించడంలో ఇంటర్మీడియట్‌ బోర్డు తీవ్రమైన తప్పులు చేసింది. నాటి సీఎం ఇంటర్‌ బోర్డ్‌ సెక్రటరీని సస్పెండ్‌ చేయాలని భావించినా, నాటి ఉన్నతాధికారులు ఆయనకు బాసటగా నిలిచి పరిస్థితిని చక్కదిద్ది చేయి దాటి పోకుండా చూసుకున్నారు. అంతకు మించిన స్థాయిలో ఫలితాలు వెలువరించడంలో గోల్‌మాల్‌ చేసిన ఇంటర్మీడియట్‌ బోర్డు నేడు మళ్లీ తన పరిమితులను చాటుకున్నది. మునుపెన్నడూ లేనివిధంగా ఈనాటి పరీక్ష ఫలితాలు చాలా మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమై వారి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చాయి. తమ ప్రమేయం ఏమీ లేకున్నప్పటికీ.. మరొకరి అసమర్థతకూ, నిర్లక్ష్యానికీ పిల్లలు బలైపోయారు. తెలం గాణలో ఇటీవలి ఎన్నికలలో పూర్తిగా  నైతిక స్థైర్యం దెబ్బతిన్న ప్రతిపక్షాలకు ప్రభుత్వం లక్ష్యంగా విమర్శించడానికి ఇది ఒక ఆయుధంగా పనికి వచ్చింది. ప్రభుత్వం పక్షం నుంచి వెంటనే తగిన నివారణా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడం కూడా సమస్యను జటిలం చేసింది. ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని పరిశీలించిన హైకోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలిచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విభజనకు ముందు ఇంటర్మీడియట్‌ విద్యా విధానాన్ని నిర్వహించటానికి ఉన్న విధి విధానాలే నేటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. స్థూలంగా ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్, ఆయన ఆఫీసు ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాల విధి విధానాలను వ్యవహారాలను చూసుకుంటాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు సిలబస్‌ విద్యాపరమైన అంశాలను పరీక్ష నిర్వహణను చూసుకుంటుంది. బోర్డుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కానీ మంత్రిగానీ అధ్యక్షులుగా ఉంటారు. బోర్డు సెక్రటరీగా వ్యవహరించే ఐఏఎస్‌ అధికారి బోర్డు కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇతర రాష్ట్రాలలో లాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఇంటర్‌ బోర్డుకు రీజనల్‌ కార్యాలయాలు లేవు. పరీక్ష నిర్వహణ ఫలితాలను రాష్ట్రమంతటికీ కేంద్రీకృత విధానంలో ఇంటర్‌ బోర్డు ద్వారా వెల్లడిస్తున్నారు. గతంలో సమాధాన పత్రాల మార్కులను క్రోడీకరించడం ఫలితాలు వెల్లడించటం కార్యాలయ సిబ్బంది సహాయంతో యాంత్రీకరణ లేకుండా చేసేవారు. 

కాలక్రమేణా మార్పులు తీసుకొచ్చి ఫలితాలను క్రోడీకరించి ఎలక్ట్రానిక్‌ విధానంలో వెల్లడించసాగారు. ఇందుకు కావలసిన సామర్థ్యం బోర్డు సిబ్బందికి లేదు కాబట్టి విభజనకు ముందే ఏపీలో ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌కి ఇవ్వడం జరిగింది. అక్కడ తగిన సాంకేతిక సిబ్బంది సామర్థ్యం ఉన్నందున వారు తగిన సంస్థను ఎన్నిక చేసి తమ పర్యవేక్షణలో ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించి ఫలితాలను ఇంటర్‌ బోర్డుకు అందజేయడం జరిగేది. ఎటువంటి వివాదాలు లేకుండా సాఫీగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుండేది. ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించే జె.ఎన్‌.టి.యు విశ్వవిద్యాలయానికి స్వతహాగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే సామర్ధ్యం ఉంది కాబట్టి  ఇతరుల సహాయ సహకారాలతో ప్రమేయం లేకుండా సాఫీగా ఎంసెట్‌ పరీక్ష ఫలితాలను నిర్వహించగలుగుతారు. నేను సీసీఎల్‌గా పనిచేసిన రోజుల్లో ఓఎంఆర్‌ షీట్‌ పరీక్ష ద్వారా విలేజ్‌ అసిస్టెంట్ల ఎంపిక చేయదలచినప్పుడు కావలిసిన సహాయ సహకారాలు జేఎన్‌టీయూ నుంచి తీసుకోవటం జరిగింది. ఎటువంటి సమస్యలు లేకుండా పెద్ద ఎత్తున ఆరోజు విలేజ్‌ అసిస్టెంట్ల ఎంపిక నిర్వహించగలిగాం. 

అటు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సహాయ సహకారాలు తీసుకోకుండా, ప్రత్యామ్నాయంగా జేఎన్‌టీయూ వారి సేవలను వినియోగించుకోకుండా, అంతర్గతంగా సరైన సామర్థ్యం లేకుండా ఒక ప్రైవేట్‌ సంస్థ ద్వారా ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకొని తెలం గాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ పెద్ద తప్పు చేసింది. ఇంటర్మీడియట్‌ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు క్రమంలో తలెత్తుతున్న సమస్యలను వివరిస్తున్నప్పటికీ, వాటిని బోర్డు  పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ పరిస్థితికి దారితీసింది. నేడు ప్రభుత్వం  ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ కూడా ఇంటర్మీడియట్‌ బోర్డు ఈ బాధ్యతలు అప్పగించిన గ్లోబరీనా సంస్థపై సరైన పర్యవేక్షణ చేయనందుకు ఇంటర్మీడియట్‌ బోర్డును అధికారులను తప్పుపట్టారు. ప్రైవేట్‌ సంస్థను ఎంచుకోవడంలో అన్ని విధివిధానాలూ పాటించి ఉన్నా, ఆచరణలో సంస్థ కార్యక్రమాలను నిశి తంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత దానికి తగిన సామర్థ్యం తమదగ్గర లేనప్పుడు అటువంటి సామర్థ్యం ఉన్న ప్రభుత్వ సంస్థ సహాయ సహకారాలు తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఇంటర్మీడియట్‌ బోర్డుపై ఉంది. ఈ బాధ్యతను ఇంటర్మీడియట్‌ బోర్డు సక్రమంగా నిర్వహించలేదన్నది ఈ మొత్తం ఉదంతంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్‌ రూపంలో వచ్చిన ఫలితాలను భౌతికంగా ఒక పది శాతం దాకా అయినా సరిచూసుకోవటం, ఇలాంటి కార్యక్రమాల్లో తీసుకోవలసిన కనీస జాగ్రత్త చర్యలు. అటువంటి నిర్ధారణ చేసి ఉంటే  పరీక్ష ఫలితాలు ప్రకటించడానికి ముందే ఈ లోపాలన్నీ ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారుల దృష్టికి వచ్చి ఉండేవి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వారు ఎంపిక చేసిన సంస్థ తోనే తమ కార్యక్రమాలను నిర్వహిం చారు. అక్కడ నేడు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సేవలు అందుబాటులో లేవు. వారు కూడా జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం లాంటి సంస్థ సహాయ సహకారాలు కూడా తీసుకోలేదు. కానీ సమస్యలు లేకుండా స్థిరంగా సాగిపోతున్న పాత సంస్థని కొనసాగించటం వలన ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా తమ ఫలితాలు వెల్లడించగలిగారు. ప్రభుత్వ పాలనలో ఎక్కడా కూడా అలసత్వానికి తావుండకూడదు. ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న పరీక్షలు నిర్వహించడంలోను ఆ ఫలితాలను సక్రమంగా వెల్లడించడంలోనూ, దురదృష్టమేమిటంటే పదే పదే ఈ విషయాలలో లోపాలు జరుగుతున్నా, విద్యార్థులకు సమస్యలు ఎదురవుతున్నా, ప్రభుత్వాలు సమస్య పునరావృతం కాని విధంగా విధి విధానాలు రూపొందించటంలో విఫలమవుతున్నాయి. ఇకనైనా మేలుకొని కేవలం ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే కాకుండా అన్ని స్థాయిల్లో కూడా పరీక్షలు నిర్వహించడంలో, ఫలితాలు వెల్లడించడంలో ఇటువంటి సమస్యలకు ఆరోపణలకు తావులేని విధి విధానాలను రూపొందించే దిశగా ప్రభుత్వాలు కృషిచేస్తే బాగుంటుంది.

కొసమెరుపు: మొదట్లోనే చెప్పినట్లు, లోపాలకు నైతిక బాధ్యత వహించి మంత్రులు రాజీనామా చేయడం అనేది ప్రహసనప్రాయంగా మారిపోవడానికి సంబంధించి నాకు తెలిసిన ఒక అంశాన్ని ప్రస్తావించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ఇది 1987లో నేను ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా చేరక ముందు జరిగిన సంఘటన. 1986లో కూడా ఇంటర్మీడియట్‌ ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగింది. నాటి ఉన్నత విద్యా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తన రాజీనామాను ఆమోదించరు అన్న పూర్తి ధీమాతో లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు  ప్రకటించారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. ఆ రోజు ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్న భోజన సదుపాయాల ఏర్పాటు సరిగా లేకపోవడంతో చాలా కోపంగా ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉన్నత విద్యాశాఖ మంత్రి రాజీనామా పత్రాన్ని పంపించారు అని తెలియజేశారు. ఆయన వెంటనే ‘ఆమోదించండి’ అని తన ఆమోదముద్రను తెలియజేశారు. సీఎం ఆమోదించరని గట్టిగా నమ్మి రాజీ నామా ప్రకటించిన ఉన్నత విద్యా శాఖ మంత్రి బయటికి తన నైతిక బాధ్యతను నొక్కి వక్కాణించినప్పటికీ.. అంతర్గతంగా ఖిన్నుడైనాడు. ఆపైన ఖమ్మం జిల్లా మంత్రివర్యులతో మీరు ఆ రోజు సరైన భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఉంటే నా రాజీనామా ఆమోదం అయిఉండేది కాదని వాపోయారట.


ఐవైఆర్‌ కృష్ణారావు
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి

ఈ–మెయిల్‌ : iyrk45@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top