మెజారిటీ సంతానం

Gollapudi Maruti Rao Article On BJP MLA Surendra Singh - Sakshi

జీవన కాలమ్‌

ఉత్తరప్రదేశ్‌ భాలియా జిల్లాలోని భైరియా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ దేశభక్తుడు. అంతేకాదు. హిందూ దేశభక్తుడు. నానా టికీ నియంత్రణ పేరిట తగ్గి పోతున్న హిందూ జనాభాకి ఆయన బాధపడి ఒక మార్గాన్ని సూచించారు. ఈ దేశంలో ప్రతి వ్యక్తీ– హిందూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని అయిదుగురు పిల్లల్ని కనాలని. మరి ఆ అయిదుగురూ ఎవరు? ఇద్దరు మగపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. మరొక బిడ్డ? స్పేర్‌ట! అప్పుడు మెజా రిటీ హిందువులకి దక్కుతుందని వారు వాక్రుచ్చారు.

జాతీయ జనాభా ప్రణాళిక ప్రకారం జనాభాను నియంత్రించే పనిని ఒక పక్క ప్రభుత్వం చేస్తుండగా సింగ్‌ వంటి దేశభక్తులు ‘స్పేర్‌’ పిల్లల్ని కని పెంచా లని సందేశాన్నిస్తున్నారు. ఇలాంటి వారికి– జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏం చేస్తోందో కూడా తెలీదు!

నా పెళ్లి నాటికి మా నాయనమ్మకి 90 ఏళ్లు. ఇది 57 సంవత్సరాల కిందటిమాట. నాకు పెళ్లయి, ఆమె ఆశీర్వాదానికి వస్తే– మా ఇద్దర్నీ తడివి ‘వందమంది సంతానాన్ని’ కనమని ఆశీర్వదించింది. ఇందులో తేలికగా 50 స్పేర్లున్నాయి. అంటే సురేంద్రసింగ్‌ ఆలోచనా ధోరణి– 57+90 నాటిది.

ఈ దేశానికి రెండో లోక్‌సభ స్పీకర్‌ మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌ని నేను చిత్తూరులో పనిచేసే రోజుల్లో తరచూ చూసేవాడిని. వారికి 14 మంది సంతానం. వారి అల్లుడు, ఆనాటి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, నాకు ఆత్మీయులు– కె. రామస్వామి అయ్యంగార్‌కి 18 మంది సంతానం అనుకుంటాను. స్పేర్‌ల ఆలోచన లేని రోజులవి.

కాలాన్ని బట్టి, మారే వ్యవస్థని బట్టి, వర్తమాన జీవన సరళిని బట్టి– ఆలోచనా ధోరణిని సవరిం చుకోలేని ఎందరో సింగులు మనకి ఉత్తర దేశంలో– ముఖ్యంగా బీజేపీలో కనిపిస్తారు. బీజేపీలోనే ఎందుకు? బాలెట్‌ పెట్టెనుంచి, పదవి దాకా ‘పాకే’ అవకాశాన్ని– వీరి ప్రమేయం లేకుండా నరేంద్ర మోదీ అనే పెను తుఫాన్‌ ఇలాంటి వారికి కల్పిం చింది కనుక. ‘హిందూ’ ప్రాముఖ్యతపై వీరు చేసే ఆలోచనలకు ఇన్నాళ్లకి రోజులొచ్చాయని అనుకునే సింగులు బోలెడంతమంది ఉన్నారు. లేకపోతే ‘స్పేర్‌’ ఆలోచనలతో– ఇలాంటివారు– తమ మాట లని ప్రజలు వినే అర్హతని కూడా సంపాదించుకోలేక పోయేవారు.
ఈ సింగు గారే– నిన్నటికి నిన్న– బీఎస్పీ నాయ కురాలు మాయావతిని గౌడు గేదెతో పోల్చారు. అప రిశుభ్రత, దుర్వాసన ఇలాంటి వాటిని ఉటంకిం చారు. చాలా అమర్యాదకరమైన, అహంకారపూరి తమైన– ఇలాంటి ప్రసంగాలు– అటు పార్టీకీ, ఇటు వ్యక్తికీ చెప్పరాని అన్యాయం చేస్తాయి. మరి వీరి ‘వాచాలత్వానికి’ అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఎవరయి నా– కేంద్ర నాయకులు చేస్తున్నారా? మనకు తెలీదు. వీరు కాలదోషం పట్టిన ఊరగాయలాంటివారు. ఒక ప్పుడు ‘రుచి’గా ఉన్నమాట నిజమే. కానీ ఇప్పుడు పూర్తిగా మురిగిపోయింది. ఇవాళ– ‘హిందూ మెజా రిటీకి స్పేర్‌ సంతానాన్ని కనే ఆలోచన– హాస్యాస్ప దమే కాక, కొంతలో కొంత ప్రమాదకరం కూడా. ఈ ఊరగాయలన్నింటినీ ఒకచోట సమావేశపరిచి– గట్టి పాఠాన్ని అమిత్‌ షా పీకాలని నాకనిపిస్తుంది.

ఈ సందర్భంలో అతి ఉదాత్తమైన, అపురూ పమైన– జ్ఞాపకాన్ని ఉటంకించాలని మనస్సు ఆరా టపడుతోంది. చాలా దశాబ్దాల కిందట ఢిల్లీలో జరి గిన ప్రపంచ చలన చిత్రోత్సవంలో జపాన్‌ దేశపు చిత్రాన్ని చూశాను. ఆ ఉత్సవాలకి వచ్చే చిత్రాలు– ఆ దేశ స్థాయిలో ఉన్నవి, దేశ వైభవాన్ని చాటేవి. ప్రపం చానికి సందేశాన్నిచ్చేవి. ఈ చిత్రం ఒక దేశ భక్తుడి కథ. ఎటువంటి దేశ భక్తుడు? అప్పుడున్న రాజకీయ వాతావరణంలో తమ దేశాన్ని కాపాడే దమ్ము, శక్తి, ఆదర్శాన్ని పుణికిపుచ్చుకోగల వీరులను ప్రస్తుతం కనే అవసరం ఉందని నమ్మే ఒక వ్యక్తి. ఆనాటి యువ తరం వీర్యాన్ని పరిపుష్టం చేసే వీరవనితలను సమీక రించి– ఆనాటి యువ కిశోరాలు కొత్త తరానికి జన్మ నిచ్చే ఉద్యమాన్ని చేపట్టిన వీరుడు. ఆలోచనలో ఎక్కడా అపశ్రుతి లేదు. ఆచరణలో ఎక్కడా అప భ్రంశం లేదు. ఎంతసేపూ దేశ భవిష్యత్తు, దేశభక్తుల ఆదర్శానికి ఏ మాత్రమూ తీసిపోని– ఓ వ్యక్తి కథ. తమ దేశానికి ప్రాతినిధ్యం వహించే చిత్రోత్సవంలో భాగం. అస్మదాదులం ఒక్క క్షణం బిత్తరపోయాం. కానీ ఆనాటి 3 గంటల చిత్రంలో ఎక్కడా ఎబ్బెట్టు తనం లేదు. సినిమా ఆద్యంతమూ కత్తిమీద సాము. ఒక్క ఫ్రేము ఎక్కువైతే కథా నాయకుడు తార్పుడు గాడు అయిపోతాడు. తూకంలో నడిస్తే దేశభక్తుడవు తాడు. ఇది దేశభక్తుడి కథ. ఒక మహర్దర్శకుని సృష్టి ఆనాటికి.

న్యాయంగా ఈ కథకీ, సింగుగారి వాచాల త్వానికీ పొంతన లేదు. కానీ అపశ్రుతిని, అశ్లీలతని సమాజయోగ్యం చేసి, కళగా మలిచిన ఓ మహా దర్శ కుని కృషిని ఈ క్షణంలో గుర్తు చేసుకోవడం అసం దర్భం కాదనుకుంటాను.


గొల్లపూడి మారుతీరావు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top