
ఈ నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు! పాకిస్తాన్ని మనం ఊరికే ఆడిపోసుకుంటుంటాం కానీ, పాపం అది ఎంత మంచి కంట్రీనో తెలిస్తే మీకు కన్నీళ్లొచ్చేస్తాయి. జాధవ్ అనే మన ఇండియన్ ఒకాయన వాళ్ల కంట్రీలో బందీగా ఉన్నాడు కదా. ఆయన్ని చూడ్డానికి ఈమధ్య ఇండియా నుంచి ఆయన తల్లి, భార్య వెళితే పాకిస్తాన్ ఎంచక్కా చూడనిచ్చింది. అబ్బే.. ఇండియా శాటిస్ఫై అయితేనా! అద్దాల్లోంచి చూడనివ్వడం కూడా ఒక చూడనివ్వడమేనా అని ఫైర్ అయింది. ‘మీకు మానవత్వం లేదా? మీకు ఫ్యామిలీ మెంబర్స్ లేరా? జాధవ్కి, ఆయన తల్లీ భార్యకు మధ్య అద్దాన్ని అడ్డంగా ఎందుకు పెట్టారు?’ అని ప్రశ్నించింది. ‘పెట్టక తప్పలేదు’ అంది పాకిస్తాన్. ‘పెట్టకపోతే ఏమౌతుంది?’ అని ప్రశ్నించింది ఇండియా.
‘పెట్టకపోతే ఏమౌతుందా? వాళ్లు ఒకళ్లనొకళ్లు హగ్ చేసుకుంటారు. ముక్కూ మూతీ రుద్దుకుంటారు’ అంది పాకిస్తాన్. ‘అయితే నీకొచ్చిన నష్టం ఏంటీ పాకిస్తాన్? వాళ్లు ఒకింటి వాళ్లేకదా’ అని ప్రశ్నించింది ఇండియా. పాకిస్తాన్ సమాధానం చెప్పలేదు. ‘పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వం. పోస్ట్లో రీజన్ పంపిస్తాం వెళ్లండి’ అని అక్కడి మన ఆఫీసర్కి చెప్పింది. చివరికి పోస్ట్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి, చూసి, చదివి, బోరుమని కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక్కడి మన ఆఫీసర్లు. ‘రెస్పెక్టెడ్ సర్.. జాధవ్ని చూడ్డానికి అతడి తల్లి, భార్య ఇక్కడికి వచ్చినప్పుడు జాధవ్ తీవ్రమైన జలుబు, ముక్కుదిబ్బడతో బాధపడుతున్నాడు. అవి ఆయన్నుంచి వారికి అంటుకోకూడదనే మధ్యలో అడ్డుగా అద్దం పెట్టాం’ అని ఉంది ఉత్తరంలో! అందుకే ఎవర్నీ గబాల్న అపార్థం చేసుకోకూడదంటారు. ముఖ్యంగా పాకిస్తాన్ని.