నమస్కారం... గురువుగారూ! | teachers day special | Sakshi
Sakshi News home page

నమస్కారం... గురువుగారూ!

Sep 5 2017 12:01 AM | Updated on Sep 17 2017 6:23 PM

నమస్కారం... గురువుగారూ!

నమస్కారం... గురువుగారూ!

మాస్టారు నమస్కారం... అంటూ ఆ గ్రామంలో నిత్యం వినిపించే గౌరవ పలకరింపులు

నేడు గురుపూజోత్సవం

ఆ కుగ్రామంలో ప్రతి ఇంటా ఓ ఉపాధ్యాయుడు
తొలి ఉపాధ్యాయునిగా పద్మనాభుడు
ఉపాధ్యాయ వృత్తితో గురువుపాలెంగా ప్రసిద్ధి పొందిన గరువుపాలెం గ్రామం
చుట్టుపక్కల గ్రామాల యువతకు ఆదర్శంగా మారిన గరువుపాలెం

మాస్టారు నమస్కారం... అంటూ ఆ గ్రామంలో నిత్యం వినిపించే గౌరవ పలకరింపులు ఆ కుగ్రామాన్ని గురువులపాలెంగా సంబోధించుకునే స్థాయికి చేర్చింది. గుంటూరు జిల్లాలోని తీరప్రాంతమైన నిజాంపట్నం మండలం గరువుపాలెం పంచాయతీ పరిధిలోని గరువుపాలెం గ్రామంలో సుమారు 180 ఇళ్లల్లో ఇప్పటి వరకు  100 మందికిపైగా ఉపాధ్యాయ వృత్తిలో పునీతులవుతున్నారు. బతకలేక బడిపంతులు అన్న రోజుల నుంచి అన్ని వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి పదిలం అన్న ఈ రోజుల వరకు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. ఒక్కొక్క కుటుంబంలో తండ్రి, ఆ తరువాత కొడుకులు, మనుమలు ఉపాధ్యాయ వృత్తిలో రోజులు హుందాగా, నిశ్చింతగా వెళ్లదీస్తున్నారు. ఆగ్రామంలో ఇంటికి ఒకరైనా ఉపాధ్యాయునిగా అవాలని కోరుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ పుట్టిన ఆడబిడ్డలు, గ్రామానికి కోడళ్లుగా వచ్చిన వారు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు.

అలాగని గ్రామంలో ఉపాధ్యాయులు తప్ప మరెవ్వరూ లేరేమో అనుకుంటే పొరపాటే! ఉపాధ్యాయులతోపాటు పోలీసు శాఖ, రక్షణ శాఖనుంచి ఇంజనీరింగ్, పలు విభాగాల వరకు విధులు నిర్వహిస్తున్నవారు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్న వారు ఉండటం ఆగ్రామంలో ఉపాధ్యాయ వృత్తి వేసిన బాటలనే చెప్పాలి. ఉపాధ్యాయ వృత్తిలో ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా మారి పలు గ్రామాల్లోని యువతను ప్రభావితం చేస్తోంది.

వ్యవసాయాన్నీ వదులుకోలేదు
వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్న గ్రామంలో వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా ఉన్నా వ్యవసాయం, దానికి అనుబంధంగా పాడి, పరిశ్రమలను వదులుకోలేదు. వాటిని అభివృద్ధి చేసుకోవటంలో ఆ గ్రామంలోని మహిళల పాత్ర కనిపిస్తుంది. ఉపాధ్యాయులుగా చుట్టుపక్కల గ్రామాల్లో పనిచేయటంతో గ్రామంలో వ్యవసాయం, పాడిపరిశ్రమలను అభివృద్ధిపథంలో నడిపించారు. దీంతోపాటు ప్రతి ఇంటిలోని యువత ఏదో ఒక ఉద్యోగంలో చేరేవరకు చదువుతో పాటు వ్యవసాయం, పాడిపరిశ్రమలలో కష్టపడేతత్వంతో ముందుకు సాగుతున్నారు.

 గ్రామంలో ప్రతి ఇంటా ఉద్యోగులు
ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువమంది కొనసాగుతుండటంతో గ్రామంలో అక్షరాస్యత పెరుగుతూ వచ్చింది. ప్రతి ఒక్కరు ఉపాధ్యాయ ఉద్యోగమో, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగమో సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగే తత్వం పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగం రాని పక్షంలో ఏదైనా ప్రయివేటు ఉద్యోగం అయినా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
– గడ్డం వాసు, సాక్షి, రేపల్లె, గుంటూరు జిల్లా

ఉపాధ్యాయ వృత్తిలో పద్మనాభుని అడుగులు అనంతం చేశాయి. వ్యవసాయ ప్రధాన వృత్తిగా కొనసాగుతూ అక్షరాస్యత నామమాత్రంగా ఉన్న రోజుల్లో కష్టపడి చదువుకుని 1930 ప్రాంతంలో గరువుపాలెం గ్రామం నుంచి ఉపాధ్యాయ వృతిలోకి బండారు పధ్మనాభుడు అడుగుపెట్టారు. చిన్న గ్రామం నుంచి ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన పద్మనాభుడు ఆ వృత్తికే వన్నె తెస్తూ ఆ గ్రామస్తుల్లో ఉపాధ్యాయ వృత్తిపట్ల మక్కువను పెంపొందించారు. ఆయన తరువాత ఒక్కొక్కరిగా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టారు. తీరప్రాంతంలోని ఓ కుగ్రామాన్ని గురువులపాలెం గ్రామంగా ప్రజల్లోకి తీసువెళ్లిన పధ్మనాభుడు 1984 ఏప్రిల్‌ 22న మృతి చెందారు.

సంతృప్తినిచ్చింది
1957లో వినయాశ్రమంలో టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసి బొడ్డువారిపాలెంలోని ఎస్‌పీఎస్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో ఉపాధ్యాయునిగా అదే సంవత్సరం బాధ్యతలలో అడుగుపెట్టాను. గరువుపాలెం ఎలిమెంటరీ స్కూల్‌లో 1993లో రిటైర్‌ అయ్యాను. దీంతో పాటు ఆనందపురంలో మేనేజ్‌మెంట్‌ పాఠశాల ప్రారంభించాను. నా ముగ్గురు కుమారుల్లో ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లగా ఒకరు పోలీసు శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌గా ఉన్నారు. 36 ఏళ్లపాటు సాగిన ఉపాధ్యాయ వృత్తి జీవితానికి ఎంతో సంతృప్తి నిచ్చింది. మా గ్రామాన్ని గరువుపాలెం అనగానే గరువుపాలెం కాదు గురువులపాలెం అంటూ పెద్దపెద్ద వారు సంబోధించటం ఆనందంగా ఉంటుంది.
– గాదె వెంకట రామారావు రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు,   గరువుపాలెం

జీతం తక్కువైనా...
ఉపాధ్యాయునిగా 1948–1986 వరకు 38 సంవత్సరాలు సేవచేశా. ఉద్యోగంలో చేరినప్పుడు రూ.19 జీతంతో జీవితం ప్రారంభించాను.జీతం తక్కువైనా సమాజంలో గౌరవంతో పాటు ఎంతో మందిని ఉన్నత స్థితికి చేర్చే అవకాశం వచ్చింది. నా ముగ్గురు కుమారుల్లో ఇద్దరు ఉపాధ్యాయులే. రిటైర్‌ అయిన తరువాత గ్రామానికి సర్పంచ్‌గా, మండల పరిషత్‌ ఉపాధ్యక్షునిగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని 90 ఏళ్ల వయస్సులో ఎంతో ఆనందంగా చెప్పారు.
– బొప్పారాధాకృష్ణమూర్తి,  రిటైర్డ్‌  ఉపాధ్యాయుడు,  మండల  పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు,
గరువుపాలెం, నిజాంపట్నం మండలం


అదృష్టంగా భావిస్తున్నాను!
గుంటూరులో టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని 1948లో ఉపాధ్యాయునిగా విధుల్లో చేరాను. ఆనందపురంతో ప్రారంభించి బొడ్డువారిపాలెం, గురజాల, గాజులవారిపాలెం, అల్లూరివారిపాలెం, కోనఫలం గ్రామాల్లో పనిచేసి అల్లపర్రు గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్‌లో 1986లో రిటైర్‌ అయ్యాను. నాముగ్గురు కుమారుల్లో ఒకరు ఉపాధ్యాయునిగా, ఒకరు కో ఆపరేటివ్‌ సొసైటీలో ఉద్యోగం చేశారు. ఉపాధ్యాయునిగా ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు చేర్చటం నా అదృష్టంగా భావిస్తున్నాను.
– కొలసాని కృష్ణమూర్తి, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు, గరువుపాలెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement