ఘర్షణ ఐక్యత ఇప్పటి విధానం

Special Story On VIRASAM - Sakshi

తెలుగు సాహిత్యంలో ఒక అరుదైన సందర్భం. తెలుగునేల నుండి దిక్కుల్ని మండించిన అక్షరాలకు యాభై సంవత్సరాలు నిండాయి. శ్రీకాకుళ పోరాటపు అగ్గిని, విప్లవ విద్యార్థుల సవాలును స్వీకరించి– తమ కలాలను కత్తులుగా, కాంతులుగా మార్చుతామనీ, వలస, భూస్వామ్య, ధనస్వామ్య అవశేషాలను తొలగించి, నూతన ప్రజాస్వామ్య స్థాపన కోసం పాటుపడతామనీ, సోషలిజం మా లక్ష్యమనీ చరిత్ర ఎద మీద సంతకం చేసి హామీ పడిన విప్లవ రచయితల సంఘం తన మాటను నిలబెట్టుకుని అర్ధ శతాబ్ది విజయపతాకను ఎగరెయ్యబోతోంది. ఆనాడు సంతకం చేసిన పద్నాలుగు మంది రచయితల్లో వరవరరావు నేడు తన ఎనభై ఏళ్ల వయసులో చీకటి జైలు నుండి వెన్నెల సందేశాలు పంపుతున్నాడు. విప్లవ కవి సాయిబాబా చావును ధిక్కరించి నవజీవన కవితలల్లుతున్నాడు.

విరసం పుట్టుక, నడక ఎంత ఆశ్చర్యకరం!  శాస్త్రీయ సిద్ధాంతం వెలుగులో నిర్మాణాత్మకంగా విప్లవించాలనుకోవడం ఎంత ఉత్తేజకరం. విరసం ఆవిర్భావం చారిత్రాత్మకం అనే మాట లాంఛనం. చారిత్రక శక్తుల రాపిడిలో పుట్టి, చరిత్ర నిర్మాణంలో భాగమవుతూ 50 ఏళ్లుగా కొనసాగుతున్నది. 1947తో పరిష్కారం కాని వైరుధ్యాల విస్ఫోటనం నుండి జనించిన నక్సల్బరీ– కరడుగట్టిన ఫ్యూడల్‌ ఆధిపత్యాన్ని  ధ్వంసం చేసే ప్రకంపనలను సృష్టించింది. చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం దీనికి అంతర్జాతీయ నేపథ్యం. ఆ చారిత్రక సన్నివేశంలో పుట్టిన శిశువు విరసం.

భూస్వామ్యం, సనాతన ధర్మం, బ్రాహ్మణ భావాలతో సాహిత్యరంగంలో వర్గపోరాటం నడిపి ఓడించింది విరసం. సాహిత్యాన్ని, సాహిత్య చరిత్రను శ్రామికులు, మట్టి మనుషుల వైపు నుంచి తిరగరాసింది. ఈ చైతన్యంతో సాహిత్య కళారూపాల తీరు మారిపోయింది. సాహిత్యం మట్టిని ముద్దాడి, అంటరానివాడలను హత్తుకుంది. జానపదాలను, మాండలికాలను వెలికి తీసింది. ఆకాశంలో సగాన్ని సాయుధం చేసింది.

భూస్వామ్య దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా వేలు, లక్షలుగా భూమి లేని నిరుపేదలు, అంటరాని మనుషులు, మహిళలు, ఆదివాసులు విప్లవంలోకి వచ్చారు. సాయుధ పోరాటాల్లో భాగమయ్యారు. అంటరానితనం, కులవివక్ష, పితృస్వామ్య కుటుంబ బంధనాలు తెంచుకొని వచ్చే చైతన్యాన్ని వర్గపోరాటమే ఇచ్చింది. ఇది భూమి కోసం పోరాటమే కాదు, భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా అన్ని రకాల సామాజిక అణచివేతలను ధ్వంసం చేసే పోరాటం.

ఇదంతా ఆనాడు శివసాగర్‌ ‘చెల్లీ చంద్రమ్మ’గా, చెరబండరాజు ‘గౌరమ్మ కల’గా, ‘ఏ కులమబ్బీ మాదే మతమబ్బీ’ అనే ఆత్మగౌరవ ప్రశ్నగా, ‘ఉందర్రా మాలపేట’ అనే వంగపండు విషాద గానంగా, అల్లం రాజయ్య ‘అగ్నికణం’లో మాదిగ బయ్యక్క విప్లవ నాయకిగా కావడంగా కనిపిస్తుంది. ఇదంతా వర్గపోరాటం కదిలించిన పీడిత సమూహాల కంఠ స్వరం. ఇప్పుడది తెగల కట్టుబాట్లను, కుటుంబ బంధనాలను తెంచుకొన్న ఆదివాసీ రాగో ముప్పై ఏళ్ల కింద చూపిన  మార్గంలో దండకారణ్య స్త్రీల విముక్తి చరిత్రగా విస్తరించింది. ఇదంతా 1970, 80ల తొలినాళ్ళ విప్లవ సాహిత్యోద్యమ అడుగుజాడలు. వర్గపోరాటంలో భాగంగా సామాజిక అణచివేతల మీద గురి ఉన్నందుకే విప్లవ సాహిత్యం అన్ని జీవన పార్శా్వలను పట్టుకున్నది.

1970లలో అట్టడుగున సాగిన వర్గపోరాటాల సంచలనమే పీడిత అస్తిత్వాల చైతన్య ప్రకటనకు దారి చూపింది. అణగారిన గొంతులు మార్మోగే ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించింది.   ప్రత్యేక అస్తిత్వ గొంతుకలు నిస్సందేహంగా సమాజాన్ని, ఉద్యమాలను సెన్సిటైజ్‌ చేశాయి. ప్రజాస్వామిక దృష్టిని మరింత నిశితమూ, విశాలమూ చేశాయి. ఇది సామాజిక ప్రగతిలో భాగం. అందుకే విరసం ఏ శషబిషలు లేకుండా వాటిని ఆహ్వానించింది. అదే సమయంలో వర్గ దృష్టి తప్పకూడదని అస్తిత్వవాదాలకు గుర్తుచేసింది. వర్గశత్రువు గురించి హెచ్చరించింది. వ్యవస్థలోని సకల ఆధిపత్యాలను పరిరక్షించి అమలు చేసే రాజ్యం పట్ల రాజీలేని వైఖరి ఉండాలని ఉద్ఘాటించింది.
విరసం ఈ యాభై ఏళ్ల ప్రయాణానికి వ్యవస్థ పట్ల, రాజ్యం పట్ల కచ్చితమైన వైఖరే కారణం. అది తప్పితే ఎలా ఉంటుందో గతంలోనే చూశాం. కొందరు స్త్రీవాదులైనా ఎన్‌జివోల వైపు, కొన్ని దళిత శక్తులైనా బూర్జువా పార్లమెంటరీ మార్గం వైపు వెళ్లి వ్యవస్థతో, రాజ్యంతో సర్దుకుపోవడం చూశాం. దోపిడీ వ్యవస్థను పరిరక్షించడానికి పార్లమెంటరీ రాజకీయాల నుంచే ఫాసిజం వస్తోందనే విషయంలో కచ్చితంగా ఉంటూనే ఈ వ్యవస్థ లోపల పీడిత సమూహాలకు బూర్జువా ప్రజాస్వామ్యం వల్ల ఏ కొంచెం ప్రయోజనం చేకూరినా దాన్ని హక్కుగా అంగీకరించాల్సిందే. అందుకే విరసం ఈ యాభై ఏళ్లుగా వ్యవస్థ సమూల మార్పు కోసం సాగుతున్న పోరాటాల వెంట నడిచినట్టే, రాజ్యాంగ పరిధిలో పీడిత సమూహాల హక్కుల కోసం జరిగిన పోరాటాలతో కలిసి నడిచింది. వాటి న్యాయకాంక్షను అక్షరబద్ధం చేసింది.

ఇలాంటి విషయాల్లో విరసం గత నలభై ఏళ్లుగా నిరంతరం సైద్ధాంతిక భావజాల సంఘర్షణ కొనసాగిస్తున్నది. ఇది 70లలో ఫ్యూడల్‌ శక్తులతో చేసిన సంవాదం వంటిది కాదు. మిత్ర వైరుధ్యంతో ఎట్లా వ్యవహరించాలో విప్లవ రచయితలకు తెలుసు. తెలుగు సాహిత్య రంగంలో అవార్డులు, అకాడమీలు, పోటీలు, రాజ్యప్రాపకాల చీడ పెరిగిపోయిన ఈ స్థితిని తీవ్రంగా విమర్శిస్తూనే ప్రజా సమస్యలపై కలిసిరాగల మేరకు వీలైనంత ఎక్కువ మందితో విరసం కలిసి పని చేస్తోంది. ఘర్షణ ఐక్యత విధానాన్ని ఆచరిస్తోంది. విరసం తన వర్గ దృక్పథంతో శత్రువెవరో, మిత్రులెవరో సునిశితంగా గుర్తిస్తుంది. ఇతరులు తనతో ఎలా ఉన్నారని కాకుండా ప్రజా సమస్యలపై ఎలా ఉన్నారనేదే ఐక్యతకు గీటురాయి. ఎన్ని విమర్శలు, విసుర్లు ఎదురైనా  సంయమనం పాటిస్తుంది. రాజ్యం విషయానికొచ్చే సరికి ఏ మాత్రం రాజీపడదు. తనమీద తనతో సహా అందరి మీద విమర్శనాత్మక అంచనా ఇదే సంస్థను అన్ని దశల్లో నిత్య నూతనంగా నడిపిస్తున్నది. అందువల్లనే విరసానికి ఉద్వేగపూరితమైన గతం ఉన్నట్లే అడుగడుగునా తనకే సాధ్యమైన సంభ్రమాశ్చర్యాల పోరాట వర్తమానం ఉన్నది.

విరసం సభ్యులు సాహిత్య కళారంగాలతోపాటు ఆర్థికం, రాజకీయాలు, సైన్స్, చరిత్ర, విద్య, రిజర్వేషన్లు వగైరా అంశాల్లో కృషి చేశారు. వర్గపోరాట సిద్ధాంతం, రాజకీయాల వల్ల విరసం సాధించిన విస్తృతి ఎలాంటిదంటే.. అంటరానితనం, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం, కశ్మీర్, ఈశ్యాన రాష్ట్రాలు, తమిళ ఈలం దగ్గరి నుంచి పర్యావరణం, ట్రాన్స్‌ జెండర్స్‌ (నిజానికి ఎల్‌జిబిటిక్యూ అనే ఐదు అత్యంత పీడిత జెండర్‌ కమ్యూనిటీలుగా గుర్తించాలి) దాకా ఈ యాభై ఏళ్లలో విరసం స్పృశించని విషయం దాదాపుగా లేదు. ఫాసిజం లక్ష్యం చేసుకున్న మైనారిటీ మతాలు, కులాలు, పీడిత సమూహాల పక్షాన నిలిచి హిందుత్వ రాజకీయాల మూలాలను విప్పి చెబుతోంది. 1984 నుండే భారత రాజ్యం ఏవైపుగా పయనిస్తోందో, దాని రాజకీయార్థిక సామాజిక మూలాలేమిటో విరసం చెబుతూ వస్తున్నది.

శ్రీకాకుళ పోరాటం దెబ్బతింటున్న సమయంలో ఏర్పడిన విరసం సాహిత్యరంగంలో సాయుధ రాజకీయాల ప్రచార ఎజెండాను స్వీకరించింది. ఈ యాభై ఏళ్లలో సమాజం అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నది. అనేక ప్రజాస్వామిక చైతన్యాలు ముందుకు వచ్చాయి. వీటన్నిటినీ విరసం స్వీకరించి తన వర్గపోరాట రాజకీయాలతో విశ్లేషిస్తున్నది. ప్రతి ఆలోచనను విప్లవం గీటురాయి మీద పరీక్షించి నిగ్గుదేలుస్తున్నది. రాజీలేకుండా భావజాల సంఘర్షణలో భాగం కావడమే దాని వర్తమానానికి, భవిష్యత్తుకు కారణం. దీనికంతా ప్రజల పోరాటాలే పునాది. ఈ యాభై ఏళ్ళ సభలు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా పీడిత అస్తిత్వ శక్తులు, వర్గపోరాట శక్తుల ఉమ్మడి కార్యాచరణకు ఒక సందర్భం కావాలని విరసం కోరుకుంటోంది.(విరసం యాభై ఏళ్ల మహాసభలు జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సందర్భంగా)-  పి.వరలక్ష్మి

4 జూలై 1970
సంస్కరణ వాదానికి కాలం చెల్లిపోయింది. సాంస్కృతిక వ్యవహారాల్లో నిస్తబ్దత పేరుకొని వుంది. అభ్యుదయ రచయితల ఉద్యమం కూడా శవప్రాయమైపోయింది. ఈ దుస్థితిని తొలగించుకొని జాతిని సమగ్ర విమోచనం వైపు నడిపేందుకు విప్లవ రచయితల సంఘం ఏర్పడుతున్నది.

ఈనాటి దోపిడీ వ్యవస్థతో రాజీలేని వైఖరి, నిజాయితీ గల ప్రతి రచయితకు తప్పనిసరి. నిజాన్ని వెల్లడించడంలో రచయితలు భయ సంకోచాలను విడిచి ప్రజలకు బాసట కావాలి. తమ కలాలను కత్తులుగా, కాంతులుగా మార్చుకోవాలి. సాంస్కృతిక వికాసానికి అంకితమైన ఈ విప్లవ రచయితల సంఘం సాహిత్యాన్ని జాతి జీవితంలో ప్రధానాంగం చేయబూనింది.

మార్క్సియన్‌ సోషలిజమే మనందరి ధ్యేయం. ప్రజల దీర్ఘ కాలిక విమోచన పోరాటాలను గుర్తించి బలపరచే రచయితలే ఇందులో సభ్యులు. ఏ రూపంలో తిరుగుతున్నా ప్రజల వర్గపోరాటాల నన్నిటినీ మనం సమర్థిస్తాం.  సర్వ సమగ్రమైన దేశ స్వాతంత్య్రం మన లక్ష్యం. వలస, భూస్వామ్య, ధనస్వామ్య ఆవశేషాలనన్నిటినీ తొలగించి, నూతన ప్రజాస్వామ్య స్థాపనకు తోడ్పడటమే మా ఉద్దేశం. శ్రామిక అంతర్జాతీయత మా వైఖరి. దేశ దేశాల ప్రజల విమోచన పోరాటాలను మేము హృదయ పూర్వకంగా బలపరుస్తాము. - శ్రీశ్రీ
4–7–1970; 1–07 ఎ.ఎం.

సంతకం చేసినవారు:
కె.వి.రమణారెడ్డి, వరవరరావు, జ్వాలాముఖి, రాచకొండ విశ్వనాథశాస్త్రి,
నిఖిలేశ్వర్, రంగనాథం, శ్రీపతి, నగ్నముని,
ఉమామహేశ్వరరావు, కేశవరావు,
శ్రీనివాసరావు, ఎస్‌.హరిపురుషోత్తమరావు, పినాకపాణి, సి.(చలసాని) ప్రసాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top