
భూమి సగటు ఉష్ణోగ్రత
భూతాపోన్నతి పుణ్యమా అని భూగోళం భగ్గుమంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకొన్నేళ్లలోనే జీవరాశులేవీ బతికే పరిస్థితి ఉండదు. ఈ విపత్తును తప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఏఆర్సీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. పంటభూముల వినియోగంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా భూమి సగటు ఉష్ణోగ్రతలను రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గించవచ్చునని వీరు అంటున్నారు. దీంతోపాటు అధిక జనాభా గల నగరాల్లో భవనాలు, రోడ్లు అన్నింటికీ తెల్లరంగు వేయడం... దుక్కుల్లేకుండా వ్యవసాయం చేయడం ద్వారా భూమి నుంచి విడుదలయ్యే రేడియోధార్మికత గణనీయంగా తగ్గుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త యాండీ పిట్మన్ అంటున్నారు.
ఈ చర్యల వల్ల ఇబ్బందులేవీ ఎదురుకావని, ఎక్కడికక్కడ ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల వ్యయప్రయాసలు తక్కువగానే ఉంటాయని యాండీ వివరించారు. కంప్యూటర్ మోడలింగ్ ద్వారా, వ్యవసాయం ద్వారా వెలువడుతున్న రేడియోధార్మికతలో మార్పులు చేసి తాము విశ్లేషించామని చెప్పారు. తాము సూచించిన చర్యలు చేపడితే సగటు ఉష్ణోగ్రతలతోపాటు విపరీత వాతావరణ పరిస్థితులు కూడా తగ్గుతాయని చెప్పారు. అధ్యయన వివరాలు నేచర్ జియోసైన్సెస్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.