'పవన్ను దసరా మేకపోతులా దండేసి తిప్పుతున్నారు'
సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను చంద్రబాబు నాయుడు దసరా పండుగకు మేకపోతులా దండేసి ఊరూరు తిప్పుతున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన బాబు, త్వరలోనే పవన్కు కూడా వెన్నుపోటు పొడుస్తాడని ఆయన జోస్యం చెప్పారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే సైన్యమని రామచంద్రరావు అన్నారు. రామోజీరావు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు మూటాముల్లె సర్దుకుంటున్నారని, వాళ్లు ఏ దేశం వెళ్లినా తిరిగి ఇద్దరినీ తీసుకొచ్చి, నడిరోడ్డుపై విచారణ చేయిస్తామని ఆయన హెచ్చరించారు.
చిత్తూరు జిల్లా అలిపిరిలో జరిగిన దాడి సంఘటన తర్వాత ముఖ్యమంత్రి పదవి పొందడం కోసం ఎవరు పాకులాడారో చంద్రబాబు నాయుడకు తెలియదా అని గట్టు రామచంద్రరావు నిలదీశారు. కేవలం అధికారం పొందడం కోసం నానా పార్టీలతో కూటమి కట్టి, అందరి మద్దతున్నా ఓడిపోయిన ఘనత కూడా ఆయనదేనని ఎద్దేవా చేశారు.