చివరి విడత నోటిఫికేషన్ విడుదల | the release of the final installment of the election notification | Sakshi
Sakshi News home page

చివరి విడత నోటిఫికేషన్ విడుదల

Apr 18 2014 4:53 AM | Updated on Aug 29 2018 8:56 PM

మూడు రాష్ట్రాల్లోని 41 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 12న చివరి విడతగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదలైంది.

న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లోని 41 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 12న చివరి విడతగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఈ ఆఖరి విడతలో ఉత్తరప్రదేశ్‌లో 18 స్థానాలకు, పశ్చిమబెంగాల్‌లో 17 సీట్లకు, బీహార్‌లో ఆరు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు ఈనెల 24 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. వాటిని 25న పరిశీలిస్తారు.
 
నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఏప్రిల్ 28 చివరి తేదీ. కాగా, చివరి విడత ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. మోడీ పోటీలో నిలిచిన వారణాసికి ఈ విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ మోడీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ పోటీ చేస్తున్న యూపీలోని ఆజంగఢ్ కు కూడా ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది.
 
నామినేషన్ల హోరు
: చివరి రెండు విడతల ఎన్నికలకు సంబంధించి బరిలో ఉన్న అభ్యర్థులు గురువారం తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కేంద్ర మంత్రి బేణిప్రసాద్ వర్మతోపాటు వారణాసి నుంచి కాంగ్రెస్ తరఫున అజయ్‌రాయ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రులు బీసీ ఖండూరి, రమేష్ పోఖ్రియాల్‌లు నామినేషన్లు దాఖలుచేసినవారిలో ఉన్నారు. అలహాబాద్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మనవడు ఆదర్ష్ శాస్త్రి నామినేషన్ దాఖలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement